అరే సాంబా వచ్చేయ్ రా పోదాం..! ఇక మనకు ఇక్కడ పని లేదంటున్న గబ్బర్ సింగ్..!!
అమరావతి/హైదరాబాద్ : గబ్బర్ సింగ్ తప్పుకున్నారు. ఇంత జరిగాక ఎందుకు ఉంటారు... ఆయన తప్పుకోవడమే బెటర్.. దాదాపు గుడ్ బై చెప్పినట్టే.. పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచే కదా తప్పుకుంటుంటుంది అని అనుకుంటున్నారా..? అనుకుంటే మాత్రం పెద్ద పొరపాటు చేసినట్టే..! ఆయన తప్పుకున్నది రాజకీయాల నుంచి కాదు... సినిమాల నుంచి...! ఈ ఎన్నికల్లో పవన్ ఓడిపోలేదు... గెలిచారు..! ఒక్క రూపాయి కూడా ఓటర్లకు పంచకుండా, ఏవేవో ఆశలు చూపి ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించకుండా, మందు పోయించకుండా, బిర్యానీ తినిపించకుండా... ఓట్లు అడిగారు చూశారా...! జనం కూడా ఓట్లు చూశారు కదా..!అదే కాటమరాయుడు నైతిక గెలుపు ఖాయమైందనే చర్చ జరుగుతోంది...!
ఓటమి నేర్పిన పాఠం..! వంద సునామీల బలంతో దూసుకెళ్తున్న పవన్..!!
ఈ ఎన్నికల్లో ఓడిపోయింది పవన్ కాదు. జనసేన ప్రభావాన్ని, బలాన్ని ఉన్నదాన్నికన్నా కూడా ఎక్కువగా ఊహించుకున్న, అతిగా అంచనా వేసుకున్న అభిమానులు, ఆశావహులు, రాజకీయ జ్యోతిష్కులు మాత్రమే ఓడిపోయారు. రాజకీయాల్లో మార్పు కోసమే వచ్చానని, పాతికేళ్ల తరువాతనైనా ఫలితం వస్తుందని ఆశిస్తున్నానని పవన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు రావచ్చేమోగానీ, పక్కాగా సీట్లు వస్తాయని పవన్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. అందుకే, ఈ ఓటమి నుంచి ఆయన త్వరగా కోలుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సంసిద్ధపరిచేందుకు ఆయన అప్పుడే కార్యాచరణకు దిగారు.
క్షేత్ర స్థాయిలో పార్టీ బలో పేతం పై దృష్టి..! స్థానికి సమరానికి సై అంటున్న గబ్బర్ సింగ్..!!
పార్టీ ఓటమి నేపథ్యంలో, సినిమాల్లోకి పవన్ రీఎంట్రీ ఇస్తారని కొందరు ఊహించారు. పవన్ తీరును చూస్తుంటే మాత్రం... సినిమాలకు దాదాపుగా గుడ్ బై చెప్పినట్టేనని అర్థమవుతోంది. ఆయన తన దృష్టినంతా రాజకీయాల పైనే కేంద్రీకరించారు. జగన్ సునామీ ఫలితంగానే ఈ అనూహ్య ఫలితాలొచ్చాయని, ఇలాంటి సందర్భంలో తొందరపడి విమర్శలు చేయటం ఏమాత్రం మంచిది కాదని పవన్ భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వ పనితీరును కొంతకాలం పరిశీలించాలని, ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే నిలదీయాలని, అవసరమైతే పోరాడాలని, తద్వారా పార్టీ ప్రతిష్ట పెంచాలని పవన్ ఆలోచిస్తున్నారు.
ప్రజా సమస్యలపై ఫోకస్..! రాజీ పడొద్దంటున్న కాటమ రాయుడు..!!
'అధికారం అనేది ప్రజాసేవకు ఒక మార్గం మాత్రమే' నన్నది పవన్ తాత్వికతగా ఆయనకు దగ్గరగా ఉంటున్న కొందరు చెబుతున్న మాట. పార్టీ విధానాల్లోనూ ఈ తాత్విక సిద్ధాంతం ప్రతిఫలించేలా కార్యాచరణ ఉంటుందని వారు అంటున్నారు. అందుకే.. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ, ఎండగడుతూ, అవసరమైతే వాటిపై పోరాడుతూ ప్రజల దగ్గరకు వెళ్లాలని, వారికి దగ్గరవాలని ప్రణాళిక రూపొందిస్తున్నారట. ఓటమి నేపథ్యంలో, తన బలం ఏమిటో... బలగం ఎవరో ఆయన ఇప్పటికే స్పష్టమైన అంచనాకు వచ్చారని, రానున్న కాలంలో ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారని పవన్ రాజకీయ సన్నిహితుల చెబుతున్న మాట.
పవన్ పట్టుదల..! ప్రజా క్షేత్రంలోనే ఉంటానంటున్న గబ్బర్ సింగ్..!!
అందుకే, గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. జగన్ తాజా గెలుపుతో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఆ పార్టీ ఉనికి కూడా ప్రమాదంలో పడినట్టే. ఒక్కమాటలో చెప్పాలంటే... విపక్షం రాజకీయంలో శూన్యత ఏర్పడింది. ఈ తరుణంలోనే, ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు జనసేనకు మంచి అవకాశం దొరికిందని పవన్ భావిస్తున్నారు. 'ఓటమి... విజయానికి సోపానం' అంటారు. జనసేనకు ప్రస్తుత ఓటమి. మున్మందు విజయాలకు సోపానంగా మారుతుందా అనేది కూడా అధినేత రాజకీయ అడుగులపై ఆధారపడి ఉంటుందనే చర్చ జరుగుతోంది.