మళ్లీ అదే తప్పు, చంద్రబాబుకు త్వరలో రిటైర్మెంట్: పవన్ కళ్యాణ్, లోకేష్కు దిమ్మతిరిగే కౌంటర్
Recommended Video
శ్రీకాకుళం: జిల్లాలోని ఉద్ధానం బాధితుల సమస్యలు వింటుంటే కన్నీళ్లు వచ్చాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అన్నారు. శ్రీకాకుళంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో తమ స్థానిక కార్యకర్తలతో మాట్లాడారు. జిల్లాకు చెందినవారు చాలామంది పొట్ట చేత పట్టుకుని కూలి పనులు చేసుకోవడానికి వలసలు వెళ్లే పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకొచ్చాయన్నారు. అవమానాలు అనేవి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకో, గతంలో పాలించిన కాంగ్రెస్ నేతలకో జరగవని వలసలు వెళ్లే వారికి జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
నేనెవరో అశోక్ గజపతిరాజు ఆ తర్వాతే మరిచారు: బాబు 40 ఏళ్ల అనుభవంపై పవన్ తీవ్రంగా
గతంలో తన వద్దకు వచ్చి చాలామంది తమ ఇబ్బందులు చెప్పుకునే వారని, సొంత ప్రాంతాన్ని వదిలి వచ్చినందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పేవారని తెలిపారు. చంద్రబాబు నాయుడు లాంటి వారు అనుసరిస్తోన్న విధానాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో జవాబుదారీ తనం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి అన్నారు.
అదే తప్పు మళ్లీ చేస్తున్నారు
అప్పట్లో హైదరాబాద్లో చేసిన తప్పే అమరావతిలోనూ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఏపీ సీఎంపై మండిపడ్డారు. పెట్టుబడులన్నీ ఒక్కచోటే పెడుతున్నారన్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ ముక్కలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పుష్కరాలకు, ప్రాజెక్టులు కట్టడానికి ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెడుతున్నాయని చెప్పారు. కానీ బాధితులను పట్టించుకోవడం లేదన్నారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటుపై కార్యకర్తలతో చర్చ
ఆయన కార్యకర్తలతో భేటీ అయి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పవన్ చర్చించారు. సగటు మనిషి కోసం సర్వస్వం దారబోస్తామని 2014లోనే ప్రకటించానని చెప్పారు. సామాజిక శాస్త్రవేత్తగా నాయకత్వాన్ని అందించాలని తాను అనుకుంటున్నానని, సమాజాన్ని అర్థం చేసుకుంటేనే ఆ పని చేయగలమని చెప్పారు.
అచ్చెన్నకు ఉన్నాళ్లు ఈ సమస్య ఎందుకు కనిపించలేదు
తాను రాజకీయాల్లోకి వచ్చింది సామాజిక రాజకీయ మార్పు కోసమని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ఉద్ధానంలో ఇన్ని వేల మంది ప్రజల జీవితాలు ఛిద్రం అవుతుంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహజ వనరులు ఉన్నా ప్రజలు ఉపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన వస్తోందన్నారు. ఇన్నాళ్లు మంత్రి అచ్చెన్నకు ఉద్దానం సమస్య ఎందుకు కనిపించలేదన్నారు. టీడీపీ నేతలు వేసిన రోడ్ల పైనే ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు చేస్తున్నారని లోకేష్ అంటున్నారని, ప్రజల డబ్బుతో ఆ రోడ్లు వేశారనే విషయం ఆయన మరిచిపోతున్నారన్నారు.
త్వరలో చంద్రబాబుకు రిటైర్మెంట్
జనసేనకు ఒక్క శాతం ఓట్లు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారని, ఒక్క శాతం ఓట్లు అయితే గత ఎన్నికల్లో మా మద్దతు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. సాయం చేసిన చేతులనే నరికేస్తున్నారన్నారు. రమణదీక్షితులుకు చంద్రబాబు రిటైర్మెంట్ ఇచ్చారని, త్వరలో చంద్రబాబుకు ప్రజలు రిటైర్మెంట్ ఇస్తారన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు 36సార్లు మాట మార్చారని, జనసేన ఒకే మాటపై ఉందన్నారు. టీడీపీ నేతలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. జన్మభూమి కమిటీలు రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, భూకబ్జాలే అన్నారు.