పరిటాల ఇంటికి ఇదే ఫస్ట్: పవన్, గుండు కొట్టించడంపై సునీత, రహస్యంలేదని పరిటాల శ్రీరామ్
Recommended Video
అనంతపురం: తాను పరిటాల కుటుంబాన్ని కలవడం ఇదే మొదటిసారి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం అన్నారు. పరిటాల కుటుంబానికి, తనకు మధ్య గతంలో ఏదో జరిగిందని, విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగిన అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి పవన్ నవ్వుతూ సమాధానం చెప్పారు. వీరి ఇంటికి తాను తొలిసారి వచ్చానన్నారు.
ఆసక్తికరం: పరిటాల ఇంటికి పవన్, ఎదురెళ్లిన శ్రీరామ్, 'తెలంగాణ ఇష్యూలా కావొద్దు'
పవన్ కళ్యాణ్ ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంట్లో అల్పాహారం తిన్న విషయం తెలిసిందే. వారిద్దరు దాదాపు గంటకు పైగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత టీ తాగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పవన్.. పరిటాల కుటుంబంతో తనకు విభేదాలు అన్న ప్రచారంపై స్పందించారు.
చంద్రబాబును ఆకాశానికెత్తిన సోము వీర్రాజు, కానీ
ఎవరితోను వివాదం లేదు, మోడీని కలుస్తా
తనకు ఎవరితో ఎలాంటి వివాదాలు, విభేదాలు లేవని పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యక్తిగతంగా అందరినీ గౌరవిస్తానని చెప్పారు. పరిటాల కుటుంబంతోను ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అది కూడా నిరూపించేందుకు వచ్చానని తెలిపారు. జిల్లా సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. రాయలసీమకు హైకోర్టుతో పాటు ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీని త్వరలో కలిసి వివరిస్తానని చెప్పారు. రాయలసీమ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
గుండు కొట్టించలేదు, నా భర్త అలాంటివాడు కాదు
పవన్ వెళ్లిపోయిన తర్వాత మంత్రి పరిటాల సునీత ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. పవన్ జిల్లా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. పవన్కు తన భర్త పరిటాల రవి గుండు కొట్టించారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తన భర్త అలాంటి వ్యక్తి కాదన్నారు.
మేం కూడా ఎవరో చెప్తే విన్నాం
పవన్కు గుండు కొట్టించారనే ప్రచారం ఎవరో చెబితే, పేపర్లో వస్తే తప్ప తమకు తెలియదని పరిటాల సునీత చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ని కూడా అడిగితే ఆయన నవ్వారని గుర్తు చేశారు. ఎవరో ఏదో మాట్లాడితే మేం సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. అసలు నేను పవన్ను నేరుగా చూడటం ఇదే అన్నారు. పరిటాల రవి, పవన్కి మధ్య కూడా పరిచయం లేదన్నారు. ఆయనను పవన్ చూడలేదన్నారు.
పవన్ రాత్రి ఫోన్ చేశారు
పవన్ కళ్యాణ్ నిన్న (శనివారం) రాత్రి ఫోన్ చేసి తాను ఇంటికి వస్తున్నట్లు చెప్పారని పరిటాల సునీత అన్నారు. తాము ఆయనకు అల్పాహార విందు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మడకశిరకు నీళ్లు ఇచ్చేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని తెలిపారు. హంద్రీనీవా పూర్తయితే అనంతపురం సస్యశ్యామలం అవుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇది ఆలస్యమైందని, చంద్రబాబు పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు.
రహస్య భేటీ జరగలేదు
పవన్ కళ్యాణ్ రాకపై పరిటాల శ్రీరామ్ స్పందించారు. అనంతపురం నుంచి పవన్ పోటీ చేయాలనుకోవడం ఆనందమని, ఆయన రాజకీయాల్లోకి యువతను ప్రోత్సహిస్తున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. యువతను తీసుకువచ్చేందుకు తన ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయన జిల్లా సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఆయనది మంచి ఆలోచన అన్నారు. పవన్ మా ఇంటికి రావడం కూడా సంతోషమన్నారు. తమ మధ్య ఎలాంటి రహస్య భేటీ జరగలేదని, కలిసి మాట్లాడమని చెప్పారు.