దివ్యాంగుడితో సెల్ఫీకి కింద కూర్చున్న జనసేనాని: కర్ణాటకలో పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం(వీడియో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నెలల తరబడి ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్నారని, వారి క్షేమం కోసం అందరూ ప్రార్థించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా గౌనిపల్లి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నెల రోజుల ముందే హామీ.. ఘనస్వాగతం
నెల రోజుల ముందే ఈ కార్యక్రమానికి వస్తానని ఆలయ ధర్మకర్తలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం ఉదయాన్నే ఈ ధార్మిక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కాగా, కోలార్ జిల్లావాసులు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆలయ విగ్రహ పున:ప్రతిష్టలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన దేవాలయమని ఆయన అన్నారు. గౌనిపల్లి ప్రజలకూ, ముఖ్యంగా జస్టిస్ గోపాలగౌడ, ధర్మకర్త వేణుగోపాల్, సీనియర్ రాజకీయ నాయకులు రమేశ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులకూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
రాయలసీమ గుర్తొస్తోంది..
ఇక్కడి వాతావరణం చూస్తుంటే తనకు రాయలసీమ గుర్తుకొస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడి లాగే ఇక్కడ నీటి కొరత వుందని, దేవుడి దయతో ఈ ఏడాది వర్షాలు కురిసి నీళ్లు వచ్చాయన్నారు. కరెంటు కొరత ఉన్నప్పటికీ ఇక్కడ కష్టపడి రైతులు పంటలు పండిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా టమాట పండించే రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ రంగంలో ఉపాధి ఎక్కువ..
ఉపాధి అవకాశాలు తక్కువయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉపాధి అవకాశాలుంటాయని, ఇందుకు తగినట్లుగా సహకార విధానం రావాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏపీలో 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కష్టాలను తీర్చడానికి తలపెట్టిన లాంగ్ మార్చ్లో పాల్గొనాలని తెలిపారు.
దివ్యాంగుడితో సెల్ఫీ కోసం కింద కూర్చున్న పవన్ కళ్యాణ్
ఏపీలో ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఉపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉండేందుకు కార్యక్రమాలు చేపట్టామని, ఇక్కడి వారందరూ ఆ కార్మికుల కోసం వేణుగోపాల స్వామిని ప్రార్థించాలని పవన్ కళ్యాణ్ కోరారు. అనంతరం విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్.