చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఫోన్: 15 నిమిషాలపాటు సంభాషణ, ‘సీఎం జగన్లో కదలిక’
అమరావతి: ప్రభుత్వ విధానాల వల్ల ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
కష్టాలు మీరే తీర్చండి.. పవన్కు కొత్త బాధ్యత.. రండి అంటూ కన్నాకు ఫోన్, తెలంగాణ లెక్కనే!
కన్నాతపాటు అన్ని పార్టీల అగ్రనేతలతో పవన్..
అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చొరవ తీసుకున్న పవన్ కళ్యాణ్.. అన్ని పార్టీల అగ్ర నాయకులతో బుధవారం ఫోన్లో మాట్లాడారు. మొదట ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు.
ఏపీ సీపీఎం కార్యదర్శ మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, లోక్సత్తా అధ్యక్షుడు డివివిఎస్ వర్మ, బీఎస్పీ అధ్యక్షుడు సంపత్ రావుతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. లాంగ్ మార్చ్ తలపెట్టడానికి గల కారణాలను కన్నా లక్ష్మీనారాయణకు పవన్ కళ్యాణ్ వివరించారు. పవన్ ఆహ్వానానికి లక్ష్మీనారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.
చంద్రబాబుకు ఫోన్.. 15 నిమిషాలపాటు..
చంద్రబాబుకు ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్.. నవంబర్ 3న విశాఖలో జనసేన తలపెట్టిన భారీ ర్యాలీకి మద్దతు కోరారు. పవన్ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇసుక అక్రమ రవాణా, కార్మికుల ఆత్మహత్యలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇసుక సమస్యపై బాధితుల పక్షాన కలిసి పోరాడేందుకు సిద్ధమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇరువురు నేతలు దాదాపు 15 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేసి.. చాలా రోజుల తర్వాత చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అందుకే లాంగ్ మార్చ్..
కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కాబట్టి ఇసుక సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందనుకుంటే నెలల తరబడి కార్మికులకు ఉపాధి లేకుండా పోయినా పట్టించుకోవడం లేదని.. వారి వెతలు అందరికీ అర్థం అయ్యేలా వచ్చే నవంబర్ 3న విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేపట్టామని పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య నాయకులతో బుధవారం రాత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లాంగ్ మార్చ్ నిర్వహణపై చర్చించారు.
తెలంగాణలో అంతా ఒక్కటయ్యారు..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్థమైన ఇసుక విధానం మూలంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 లక్షల మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. భవన నిర్మాణ కార్మికులు తమ కష్టాలను వివరించారు. తెలంగాణలో 48వేల మంది ఆర్టీసీ కార్మికులను తొలగిస్తే అన్ని పార్టీలు ఏకమై పోరాడుతున్నాయి. ఇక్కడ లక్షల మంది నెలల తరబడి ఉపాధికి దూరమయ్యారు. అన్ని పార్టీలు కలిసి పోరాడాలని కార్మికులు చెప్పారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
జనసేన పిలుపుతో సీఎంలో కదలిక
మన పార్టీ లాంగ్ మార్చ్కు పిలుపునిచ్చిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇప్పటివరకూ మాట్లాడని ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూలు మొదలుపెట్టారు. లాంగ్ మార్చ్కు తరలి రావడంలో మన నాయకులు, శ్రేణులు జాగరూకతతో వ్యవహరించాలి. నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్, జేడీ లక్ష్మీనారాయణలతో మీరు సమన్వయం చేసుకుంటూ లాంగ్ మార్చ్లో పాలుపంచుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.