అందుకే తెలంగాణ విడిపోయింది, బాబులో రాహుల్ హుషారు: పవన్ దెబ్బకుదెబ్బ, హీరోలకు క్రేజ్ తగ్గుతుందంటే..
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న జనసేన పోరాట యాత్రలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ తనపై చేస్తున్న ఎదురుదాడిని తిప్పికొడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన సోమవారం రాజాం, పాలకొండలో మాట్లాడారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందడానికి నీళ్లు, నిధులు, నియామకాలే కావాలన్నారు. తెలంగాణ అందుకే విడిపోయిందన్నారు. కొన్నేళ్లుగా కళింగాంధ్ర, ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందన్నారు.
Recommended Video
చదవండి: అవసరమైతే జగన్తో ఆలింగనం, బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్
ఉత్తరాంధ్రలో నటనలో ఓనమాలు దిద్దానని చెప్పారు. తోటపల్లి రిజర్వాయిర్ రైతులు కన్నీటి పర్యంతమయ్యారన్నారు. రూ.265 కోట్లు అవసరమైన ప్రాజెక్టును పట్టించుకోకుండా పుష్కరాల కోసం రూ. 2,000 కోట్లు వెచ్చించారన్నారు. ఇటీవలే ఫైబర్ నెట్కోసం రూ.500 కోట్లను హెరిటేజ్లో పని చేసినవారి కోసం ఇచ్చారుగానీ తోటపల్లిని పట్టించుకోలేదన్నారు.
చదవండి: 'నాలుగేళ్లలో ఇదీ చంద్రబాబు పరిస్థితి, ఎంత చెప్పినా 16 సీట్లలో గెలుపు, అసలు టీడీపీకి ఉలుకెందుకు?
జనసైనికులారా ఇలా చేయండి, కేంద్రం మెడలు వంచుదాం
జనసేన సైనికులకి చెప్పేది ఒక్కటేనని, గ్రామాలకి వెళ్లి రైతులను, ఆడపడుచులను, యువతని, సర్పంచ్లనీ కలవాలని, అక్కడి సమస్యలని గుర్తించాలని, వాటిపై మనం అంతా కలిసి దృష్టిపెట్టి ఎలా పరిష్కారించాలో ఆలోచన చేద్దామని, జనం కష్టం, వారికి కలుగుతున్న నష్టాలు తెలుసుకుందామని, ఏసీ గదుల్లో కూర్చొనే రాజకీయాలు వద్దని, యువత అంతా ఓట్లు నమోదు చేసుకోవాలని, మీ తల్లిదండ్రుల్ని జనసేనకు ఓటు వేసేలా మోటివేట్ చేయాలని, నేను పదవుల కోసమే వస్తే గత ఎన్నికల్లోనే పదవి తీసుకొనేవాడినని, ప్రజల సమస్యలు అవగాహన చేసుకొని మీలో ఒకడిగా ప్రజల భాగస్వామ్యంతో పాలన ఇస్తానని, అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదని పవన్ అన్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఉద్యోగాలు కల్పిద్దామని, ఈ ప్రాంత వెనుకబాటుతనానికి కారణమైన ప్రతి ఎమ్మెల్యేని, ఎంపీని ధైర్యంగా నిలదీయాలని, భయపడొద్దని, మన పార్టీని బలమైన సంకల్పంతో ముందుకు తీసుకువెళ్దామన్నారు. బీజేపీ హోదా ఇస్తామని అన్యాయం చేసిందని, కేంద్రం మెడలు వంచి హోదా సాధించుకుందామన్నారు.
ప్రజల్లో ఉంటే హీరోలకు క్రేజ్ తగ్గుతుందని చెబితే
హీరోలు ప్రజల్లో ఉంటే క్రేజ్ తగ్గుతుందని తనకు కొంతమంది చెప్పారని, కానీ తాను క్రేజ్ కోసం చూడటం లేదని, ప్రజల మధ్య ఉండాలని, సామాన్యుడిలా బతకాలనుకుంటున్నానని పవన్ అంతకుముందు రోజు అన్నారు. సామాజిక, రాజకీయ మార్పు కోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందని, మార్పు కచ్ఛితమన్నారు. 2019 ఎన్నికల్లో సరికొత్త రాజకీయ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామన్నారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయ వ్యవస్థ కాకుండా సరికొత్త రాజకీయ ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుదామన్నారు. విభజన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పులు చేశాయని, విభజన హామీలు నెరవేర్చడంలో ప్రధాని మాటమార్చారన్నారు.
ఆమరణ దీక్షకు సిద్ధమని ప్రధాని, రాష్ట్రానికి తెలిపా
నాలుగేళ్లలో ఎన్నో చెప్పిన ప్రధాని ప్యాకేజీ, ప్రత్యేక హోదా అంటూ మోసగించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కేంద్రం తన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా తాను నిరసన కవాతును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోదాపై అవసరమైతే తాను ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమని ఈ నెల 14వ తేదీన ప్రధానితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామన్నారు. జనసైనికులపై దాడులు చేయడం, కరెంటు తీసేయడం, పోలీసుల సహకారం లేకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడడం తనను కలచి వేసిందన్నారు. తమది అందరిలాంటి రాజకీయ పార్టీ కాదని, సామాజిక చైతన్యం కోసం పని చేస్తుందన్నారు.
రాహుల్ గాంధీతో హుషారుగా చంద్రబాబు
జనసేన పార్టీ అందరి పార్టీ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి ఉద్యోగం, ఇల్లు, పింఛను, మత్స్యకారులకు ఆదుకునేందుకు ఆలోచిస్తున్నామన్నారు. ఏపీని కాంగ్రెస్ ఇష్టానుసారంగా విభజించిందన్నారు. ఆ పార్టీ నాయకులతోనే చంద్రబాబు సన్నిహితంగా మెలుగుతున్నారని, కర్ణాటకలో రాహుల్ గాంధీతో అత్యంత చనువుగా ఉన్నారన్నారు. ఆయనను తాకుతూ హుషారుగా కనిపించారన్నారు. అది చూసి నేను చాలా ఆనందించానని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీతో అయినా కలిసి బాబు పోటీ చేస్తారని, జనసేన అలా చేయదన్నారు. వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదన్నారు.
పవన్ కళ్యాణ్ దెబ్బకు దెబ్బ
రాహుల్ గాంధీతో చంద్రబాబు హుషారుగా కనిపించారని, ఆ పార్టీతో కలిసి పోటీ చేసినా చేస్తారని చెప్పడానికి పదేపదే టీడీపీ నేతలు తనను టార్గెట్ చేసుకోవడమే కారణమని అంటున్నారు. తాను లెఫ్ట్ పార్టీతో కలిసి ముందుకు సాగుతానని స్పష్టంగా చెప్పినా, ఎవరో బీజేపీ లేదా ప్రధాని మోడీ ఆడిస్తే తాను ఆడుతున్నానని చంద్రబాబు సహా తెలుగు తమ్ముళ్లు విమర్శించడంతో పవన్ దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బెంగళూరులో రాహుల్ - చంద్రబాబు షేక్ హ్యాండ్ అంశాన్ని తీశారని భావిస్తున్నారు.