భారత సంస్కృతిని మార్చాలని విదేశీయులు యత్నించారు, లౌకికవాదం పేరుతో హిందుత్వంపై దాడి: పవన్
అమరావతి/రాజమహేంద్రవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం అర్చకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తమ బాధలను ఆయనకు విన్నవించుకున్నారు. ఈ మధ్య తమను అన్ని పార్టీలు అణగదొక్కుతున్నాయని వారు వాపోయారు. 1980కి ముందు ఎంతమంది బ్రాహ్మణులు అసెంబ్లీలో ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారని వారు గుర్తు చేసుకున్నారు. చట్ట సభల్లో అడుగుపెట్టకుండా చేస్తున్నారన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు మాట్లాడారు.
సినిమా చేస్తా అని ఒక్క సంతకం పెడితే కోట్లు వచ్చే రంగాన్ని వదులుకొని పవన్ మన కోసం వచ్చారని, మీరు అందరూ కూడా ఆయన్ని నమ్మాలని, ఆయన వెనుక నడవాలని మనోహర్ చెప్పారు. పవన్ నడిచే దారిలో మీరంతా ఆశీర్వచనాలు ఇవ్వాలన్నారు. తనకు స్వతహాగా సౌందరరాజన్ పోరాట పటిమ ఇష్టమని, ఆయన దేవాలయాల పరిరక్షణ కోసం పోరాటం చేస్తారన్నారు. అనంతరం పవన్ మాట్లాడారు.
లక్ష్మీనారాయణ అనూహ్య నిర్ణయం, 26న కొత్త పార్టీ: అందరికీ భిన్నంగా అవే కీలకం
భారత సంస్కృతిని మార్చాలని విదేశీయుల ప్రయత్నం
తనకు బ్రాహ్మణ సమాజం అంటే చాలా గౌరవమని పవన్ చెప్పారు. ఈ దేశానికి కులాలు, మతాలు కంటే కూడా ధర్మం అవసరమని చెప్పారు. ఈ వ్యవస్థ మీద విసుగు వచ్చి నేను 21 ఏళ్ల వయస్సులోనే తిరుపతికి వెళ్లి క్రియా యోగ నేర్చుకున్నానని, అప్పుడే తనకు సంపాదన మీద ఆశపోయిందని చెప్పారు. భగవంతుడి సృష్టిలో చిన్న కాలం మన జీవితం అన్నారు. భారత సంస్కృతిని మార్చాలని విదేశీయులు చాలా ప్రయత్నాలు చేశారని, కానీ ఎవరూ మార్చలేకపోయారని, ఎవరినైనా అత్యున్నతమైన మన భారత సంస్కృతి మార్చివేస్తుందని చెప్పారు.
మీరు గౌరవంగా బతికేస్థితి తీసుకొస్తా
భారత సంస్కృతి అంటే హైందవ సంస్కృతే కాదని, మనిషిని మనిషిగా చూసే సంస్కృతి అని, అదే మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని పవన్ చెప్పారు. మన నేల ఎంతు పనీతమైనదని, దీనిని ఎవరూ మార్చలేరని, రాజకీయ నాయకులు కూడా మన భారత సంస్కృతిని విచ్ఛిన్నం చేయలేరని చెప్పారు. బ్రాహ్మణ కార్పోరేషన్కు రూ.1500 కోట్లు ఇస్తామని కొందరు చెబుతున్నారని, కానీ తాను అలా ఇవ్వడానికి రాలేదని, బ్రాహ్మణులు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించేందుకు వచ్చానని చెప్పారు. తమిళనాడులో, సినిమాల్లో చాలాచోట్ల బ్రాహ్మణులను అపహాస్యం చేస్తారని, నేను మీకు గౌరవంగా బతికే స్థితిని తీసుకొస్తానని చెప్పారు.
ఎప్పుడో ఎవరో తప్పు చేస్తే నేటి బ్రాహ్మణులను తప్పుపడితే సహించను
సమాజ అభివృద్ధిని కాంక్షించే బ్రాహ్మణ జాతిని అపహాస్యం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోనని, ఎప్పుడో ఎవరో చేసిన తప్పులకు నేటి బ్రాహ్మణులను తప్పు పడితే సహించనని పవన్ చెప్పారు. ప్రతి వర్గంలో కూడా కొంతమంది తప్పులు చేసేవారు ఉంటారని, వారిని దృష్టిలో పెట్టుకొని అందరినీ నిందించవద్దని చెప్పారు. ప్రతి పార్టీ కూడా కులాల వారీగా విభజన చేసి రాజకీయాలు చేస్తోందన్నారు. తాను అలా చేసేందుకు రాలేదన్నారు. ఓట్లకు పరిమితం కాకుండా సామాజిక మార్పు ఉద్యమంలో అందరూ ఉండాలన్నారు.
లౌకికత్వం పేరుతో హిందూమతంపై దాడులు
దేవాలయాల మీద, బ్రాహ్మణుల మీద నమ్మకం లేని వ్యక్తులను దేవాదాయ శాఖల పదవుల్లో కూర్చోబెట్టి దాడులు చేపిస్తామంటే ఊరుకునేది లేదని చంద్రబాబును, టీటీడీని ఉద్దేశించి అన్నారు. లౌకికత్వం పేరు మీద ఒక్క హిందూమతంపై దాడులు ఎందుకు చేస్తున్నారని, ఎందుకు బ్రాహ్మణ వ్యవస్థను నాశనం చేస్తున్నారని, దీనిమీద మాట్లాడాల్సిన బాధ్యత టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్లకు లేదా అని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే హిందువులను వాడుకుంటోందని, వారు అవకాశవాద రాజకీయాలు చేస్తారని, హిందుత్వానికి మీరు ఏమైనా గుత్తేదారులా అన్నారు.
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రామమందిరం నిర్మించేది
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రామమందిరాన్ని నిర్మించేవారని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ వారు హిందువులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. మతం ఆధారంగా ఎవరినీ నమ్మవద్దన్నారు. తాను ప్రతి మనిషిలో దేవుడిని చూస్తానని చెప్పారు. అందుకే మురికిని శుభ్రపరిచే రెల్లి కులాన్ని స్వీకరించానని చెప్పారు. చిన్న దేవాలయంలో ఉండే పూజారి ఎన్నో వేదాలు నేర్చుకుంటే, అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేసే వ్యక్తి ఎంత నేర్చుకోవాలని ప్రశ్నించారు. కేవలం కోట్లు ఉంటే సరిపోతుందా అన్నారు. మీరు నాకే ఓటు వేయండి అని చెప్పనని, కానీ ఆలోచించి వేయమని మాత్రం చెబుతానని అన్నారు.
ఇక పోటీ చేయాలని నిర్ణయించుకున్నా
తనకు ఇష్టమైన కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు కూడా ఒక బ్రాహ్మణుడని, ఆయన కవితల్లో ఉండే ఆవేదన, ఆవేశం తనను ఎంతో ప్రభావితం చేసిందని పవన్ అన్నారు. 2009 నుంచి ఏమీ ఆశించకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని, ప్రజల బాధలు అర్థం చేసుకోవడానికి ఆగానని, ఇప్పుడు వ్యవస్థను మార్చేందుకు 2019 లో ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. బ్రాహ్మణ వసతి గృహాలు అడిగానని, అన్ని వర్గాల పిల్లలు కలిసి మెలిసి ఉండే వాతావరణం కావాలని చెప్పారు. బ్రాహ్మణుల తాలూకు పోరాటమే లేకుంటే భారతదేశానికి స్వాతంత్ర్యమే వచ్చేది కాదన్నారు. ఈ సందర్భంగా తవద్దకు తీసుకు వచ్చిన ఓ పాపకు పవన్ కళ్యాణ్ బాలలలిత అని నామకరణం చేశారు.