పవన్ నుంచి ఊహించని రియాక్షన్.... ప్రత్యర్థులు సైతం జగన్కు ఫిదా...
40 ఏళ్ల రాజకీయ చరిత్ర... స్థిరమైన ఓటు బ్యాంకు కలిగిన టీడీపీని పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని వైసీపీతో జగన్మోహన్ రెడ్డి నిలువునా కూల్చేశాడు. 151 అసెంబ్లీ స్థానాలతో కనీ వినీ ఎరుగని విజయం సాధించాడు. అయితే అసలు కథ అక్కడి నుంచే మొదలైంది. పరిపాలనకు కొత్త కావడం... మరోవైపు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండటంతో... జగన్ ఎలా నెట్టుకొస్తాడోనని చాలామంది సందేహించారు. కానీ ప్రస్తుతం జగన్ పాలన సాగుతున్న తీరు చూస్తుంటే ఆ సందేహాలు,అనుమానాలు పటాపంచలైనట్లే కనిపిస్తోంది. కరోనా వేళ మహా మహా ఉద్దండులే విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో... వైఎస్ జగన్ మాత్రం ప్రత్యర్థుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
జగన్కు పవన్ ప్రశంసలు
'ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు,అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులను ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ప్రారంభించడం అభినందనీయం. అలాగే గత 3 నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం..' అంటూ పవన్ కల్యాణ్ ట్విట్టర్లో జగన్పై ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు జగన్ను 'సీఎం' అని సంబోధించేందుకు కూడా ఇష్టపడని పవన్... ఇప్పుడు తనే స్వయంగా ఆయనకు అభినందనలు చెప్పడం గమనార్హం.
వైసీపీకి బిగ్ బూస్టింగ్...
108,104 అంబులెన్సుల విషయంలో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం తీవ్ర విమర్శలు,ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంబులెన్సుల కొనుగోళ్లలో రూ.300 కోట్లు అవినీతి జరిగిందని... విజయసాయి రెడ్డి బంధువులకు కాంట్రాక్ట్ అప్పగించారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఇవన్నీ పస లేని ఆరోపణలని... అంబులెన్సుల కొనుగోళ్లకు రూ.200 కోట్లు వెచ్చిస్తే రూ.300 కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్పై ప్రశంసలు కురిపించడం వైసీపీకి బిగ్ బూస్టింగ్ అనే చెప్పాలి. పవన్ వ్యాఖ్యలతో వైసీపీ చంద్రబాబును కూడా కౌంటర్ చేయవచ్చు.
కరోనా నియంత్రణలో జగన్ భేష్...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... చాలా రాష్ట్రాలు వైరస్ నియంత్రణకు అష్టకష్టాలు పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సరైన విధానం లేక ప్రభుత్వాలు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తొలి నుంచి 'ట్రేస్,టెస్ట్,ట్రీట్' అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. టెస్టుల సంఖ్యను పెంచడం,ప్రతీ జిల్లాలో కోవిడ్ 19 ఆస్పత్రులను ఏర్పాటు చేయడం మంచి ఫలితాలనిచ్చాయి. తాజాగా 1088 అత్యాధునిక అంబులెన్సులను ప్రారంభించడం దేశవ్యాప్తంగా ఆయనపై ప్రశంసలు కురిసేలా చేసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ అంబులెన్సులు ప్రజలకు సేవలందించనున్నాయి.
Recommended Video
ప్రతీ మండలంలో ఒక అంబులెన్సు..
కొత్తగా ప్రారంభించిన అంబులెన్సుల్లో 676 కొత్త 104 వాహనాలు, 412 108 వాహనాలు ఉన్నాయి. విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వీటిల్లో అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 412 అంబులెన్స్లలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)గా తీర్చిదిద్దారు.చిన్నారులు, గర్భిణీల కోసం కూడా ప్రత్యేకంగా 26 నియో నిటల్ అంబులెన్సులు ప్రారంభించారు. ఇకపై ప్రతి మండలంలో ఒక 108, ఒక 104 అంబులెన్స్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.