బిజెపికి నష్టం తప్పదు: పవన్ హెచ్చరిక, వైఎస్సే తెచ్చారు, చంద్రబాబుకు మార్కులు!
విజయవాడ: ఏపీకిచ్చిన హామీని నెరవేర్చకుంటే బిజెపికి నష్టం తప్పదని, తాను పలు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తే ఆయన సానుకూలంగా స్పందించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. ఇరువురు రెండు గంటలకు పైగా సమావేశమయ్యారు.
తాను రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకాలేదని, ఆ విషయమై ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని చెప్పారు. రాజధాని అమరావతి కోసం భూసమీకరణ ద్వారా కాకుండా రైతులను ఒప్పించి తీసుకునేందుకు చంద్రబాబు మొగ్గు చూపినందున అందుకు కృతజ్ఞతలు చెప్పానని అన్నారు.
తాను కొందరు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. అలాగే, విశాఖలో బాక్సైట్ తవ్వకాల విషయం సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనుల జీవనం దెబ్బతినకుండా చూడాలని కోరినట్లు చెప్పారు.
ఆదివాసీలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారన్నారు. చంద్రబాబుతో పలు విషయాలపై చర్చించానని, ఆయన చెప్పిన వివరాలు ఆశాజనకంగానే కనిపించిందన్నారు. సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. రాజధాని ప్రాంతంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు.
రెండో విషయం.. ప్రత్యేక హోదా గురించి చర్చించామన్నారు. హోదా పైన కేంద్రం నిర్ణయం తెలిశాక, మన స్పందన తెలియజేయాలని నిర్ణయించామన్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు దృష్టి అంతా రాజధాని పైనే ఉందన్న వాదన ఉందని, దానిని ఆయన దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు.
బాక్సైట్ తవ్వకాలు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని, నాడు వైయస్ హయాంలోనే బాక్సైట్ తవ్వకాల అంశం తెరపైకి వచ్చిందన్నారు. తమ మధ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోటీ ప్రస్తావన రాలేదని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలను చర్చించలేదన్నారు. ఎవరినీ బలవంతం పెట్టి భూములు తీసుకోవటం లేదన్నారు.
బిజెపి మాట నిలబెట్టుకోకుంటే..
ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటే బిజెపి నష్టం జరుగుతుందని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే తాను తప్పకుండా స్పందిస్తానని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకోనని అభిప్రాయపడ్డారు. బిజెపి ఏ పేరుతో సాయం చేసినా.. రాష్ట్రానికి కావాల్సింది లబ్ధి అన్నారు.