మొండికిపోతే పోరాటమే.. మరో నందిగ్రామ్ చేయవద్దు: టీడీపీకి పవన్ హెచ్చరిక
హైదరాబాద్ : ఆక్వా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తే.. కలిసొచ్చే పార్టీలతో కలిసి శాంతియుత పోరాటం చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సాధారణ మనుషులు నివసించే పల్లెల్లో 144 సెక్షన్ పెట్టి మరీ వారిని వేధించేంత అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు పవన్.
తొలుత పలువురు రైతులతో నేరుగా మాట్లాడించిన పవన్.. అనంతరం వారికి తన మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. కాగా, చెప్పినట్లుగానే 4గం.లకు ప్రెస్ మీట్ పెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఎప్పుడూ స్టేజీపై సింగిల్ గానే దర్శనమిచ్చే పవన్ కళ్యాణ్.. ఈసారి గోదావరి జిల్లా రైతులను స్టేజి ఎక్కించడం గమనార్హం. భీమవరంలో అక్వా ఫుడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు ఉద్యమిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. ఏ నేతను కలిస్తే న్యాయం చేస్తారో తెలియని స్థితిలో గోదావరి జిల్లాల రైతులంతా పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. రైతుల ఆవేదన పట్ల సానుకూలంగా స్పందించిన పవన్.. ఈమేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ప్రెస్ మీట్ లో ఓ రైతు ఆవేదన :
రెండున్నరేళ్లుగా ఉద్యమిస్తోన్న మా గోడు పట్టించుకోలేదు. ఆక్వా ఫ్యాక్టరికి వ్యతిరేకంగా గొంతెత్తున్న వారిపై బైండోవర్ కేసులు పెట్టి మరీ వేధించుకు తింటున్నారు. వందమందికి అన్యాయం జరిగితే పదిమందికి న్యాయం జరిగే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అవసరమా? ఫ్యాక్టరీ రసాయనాల వల్ల గుంతేరు కాలువ కలుషితమై పంట పొలాలు నాశనమైపోతే.. మా పరిస్థితేంటి?.
సెక్షన్-307 కింద కేసులు పెడుతున్నారు. ఓటర్ల లిస్టు పట్టుకుని మరీ కేసులు ప్రభుత్వం కేసులు పెడుతూ వస్తోంది. ఆఖరికి బహిర్భూమికి వెళ్లినా ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈరోజు కూడా ఆరుగురుని జైల్లో తీసుకెళ్లి పెట్టారు. వాళ్లేమైనా మారణాయుధాలతో తిరుగుతున్నారా? 307కింద కేసు పెట్టడానికి? కేసులు పెట్టినవారిని వదలద్దు అంటున్నారు సీఐ. ఏం వారేమైనా మర్డర్లు చేశారా..? మీకె అంత పట్టుదల ఉంటే.. అక్కడే పుట్టి, పెరిగిన మాకెంత పట్టుదల ఉండాలి. అంటూ ఓ గోదావరి జిల్లా రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు.
మహిళలని కూడా చూడకుండా వేధింపులు
గత రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మా దగ్గర చెరువులకని పొలాలు కొని, రెండు పంటలు పండే పొలాల్లో ఫ్యాక్టరీలు కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బైండోవర్ లాంటి అనేకమైన కేసులు పెడుతున్నారు. ఇప్పటికీ 35 రోజులుగా మా ఊళ్లో మగవాళ్లు ఊళ్లో అడుగుపెట్టకుండా దూరం దూరంగా తిరుగుతున్నారు. ప్రశ్నించడానికి వెళ్లిన మమ్మల్ని కూడా మహిళలని కూడా చూడకుండా వేధింపులకు గురిచేస్తున్నారు.
గోదావరి జిల్లాలను మరో నందిగ్రామ్ చేయవద్దు :
40వేలకు పైగా మత్స్యకారులు బాధపడుతోన్నా.. టీడీపీ ప్రభుత్వం అక్కడే ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటుందో తెలియడం లేదని పవన్ కళ్యాణ్ వాపోయారు. ఒక పరిశ్రమ పెట్టాలంటే.. పంటలకు అనుకూలంగా లేని ప్రాంతంలోనే పరిశ్రమ పెట్టాలి. అలాంటి కనీస నియమాల్ని పాటించకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. భవిష్యత్తులో అవి కుల పోరాటాలకు దారితీస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గంగానది, గోదావరి లాంటి నదులు పరిశ్రమల కాలుష్యానికి గురవుతున్నాయంటే.. ప్రభుత్వాలు కేవలం పారిశ్రామిక లాభాలను లక్ష్యంగా పెట్టుకోవడం వల్లనే అలా జరుగుతోందన్నారు పవన్. గోదావరి జిల్లాల్లో ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే అక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు స్పందించడంలేదో అర్ధమవడంలేదన్నారు. '144 సెక్షన్ ఎందుకు పెట్టారో తెలియదు, రెండున్నరేళ్లుగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తోన్న ఎందుకు పట్టించుకోవట్లేదు. వారికి మద్దతుగా వెళ్లిన సీపీఐ నేతల్ని ఎందుకు అరెస్టు చేశారు?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పవన్.
ప్రభుత్వం గానీ ఈ విషయంలో ఆలోచించకుండా ముందుకు వెళ్తే.. మరో నందిగ్రామ్ ను తలపించే పరిస్థితి తలెత్తుందని హెచ్చరించారు. నిజానికి భీమవరం వెళ్లి, తుందుర్తి గ్రామాన్ని పరిశీలిద్దామనుకున్నానని చెప్పిన పవన్, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశ్యంతో ఆ ప్రయత్నం మానుకున్నాని చెప్పారు. ఏళ్లుగా పారిశ్రామిక ప్రగతి కొన్ని కులాల మధ్యలో ఉండిపోతుందని ఈ సందర్బంగా పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే కుల పోరాటాలు :
ప్యాక్టరీ ఏర్పాటు విషయంలో ఆచీ తూచీ నిర్ణయం తీసుకోకపోతే గోదావరి జిల్లాల్లో కుల పోరాటాలు వస్తాయన్నారు పవన్. సామాజిక అంచనా లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయడం సబబు కాదన్నారు. సంపద ఎప్పుడు కొన్ని కులాల మధ్యనే ఉంటున్న పరిస్థితి నెలకొందని వాపోయారు పవన్. పరిశ్రమలకు లైసెన్స్ ఇచ్చేప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలని హితవు పలికారు.
దీనిపై రాష్ట్ర హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి లోతుగా విశ్లేషణ జరిపించాలని మీడియా ముఖంగా విన్నవించారు పవన్. ఫ్యాక్టరీని తుందుర్తిలో కాకుండా తీర ప్రాంతానికి తరలించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఈ విషయంలో జనసేన గోదావరి ప్రజలకు మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
గత ఎన్నికల్లో ప.గో. లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ స్థానాలు గెలుచుకుందన్న విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలని సూచించారు పవన్. మొత్తం గోదావరి జిల్లాల ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తుంటే ఎంపీ గోకరాజు గంగరాజు నుంచి స్పందనే లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోందని అన్నారు.
గంగానదిని ప్రక్షాళనం చేయడానికి మోడీ గారు కంకణం కట్టుకుంటే గోకరాజు గారు మాత్రం గోదావరిని కలుషితం చేయడానికి నిర్ణయించుకున్నట్లున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవన్. ప్రభుత్వం మొండి వైఖరి వహించే పక్షంలో కలిసొచ్చే పార్టీలతో శాంతియుత పద్దతిలో దీనిపై పోరాటం చేయడానికి ముందుకొస్తానని. రైతులంతా సహనం పాటించాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోలేని పక్షంలో హైకోర్టు ఓ కమిటీని వేసి ఫ్యాక్టరీ విషయం తేల్చాలన్నారు.