2019లో పెనుమార్పులు, నాకు సినిమా చాలు, దెబ్బలు తింటా: పవన్ సంచలనం
కదిరి: అనంతపురం సమస్యలు పరిష్కరించే వారికే 2019లో తన మద్దతు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన కదిరి చౌరస్తాలో అభిమానులను, కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
యువత తలుచుకుంటే మార్పు సాధ్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై తాను ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. నేను ఓ మాట ఇచ్చానంటే దానిని అమలు చేస్తానని చెప్పారు. అనంతపురం జిల్లాను దత్తత తీసుకున్నానని, తరుచూ ఇక్కడకు వస్తానని ఆయన చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు.
ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా అండగా ఉంటా
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కదిరిలో మహిళలు, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, బాధిత మహిళలకు ఏ మేరకు పింఛన్ ఇవ్వాలనే విషయం ఆలోచించాలన్నారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభం గురించి కూడా మాట్లాడాల్సి ఉందని చెప్పారు. తాను ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా అండగా ఉంటానని చెప్పారు.
2019లో రాజకీయాల్లో చాలా మార్పులు
రైతులకు న్యాయం చేసే వారికి తాను మద్దతిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. 2019లో రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆరంగేట్రం నేపథ్యంలో ఏపీలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ముందు నుంచి చాలామంది భావిస్తున్నారు. యువత తలుచుకుంటే మార్పు తప్పక వస్తుందన్నారు. నేను ఒకటి రెండు ఎన్నికల తర్వాత వెళ్లిపోయే వ్యక్తిని కాదన్నారు. ఏ సమస్య అయినా సినిమాలో వలె రెండున్నర గంటల్లో పరిష్కారమయ్యేది కాదని అందరూ అర్థం చేసుకోవాలన్నారు.
రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం కాదు
సినిమాల్లో చూపించినట్లు రాయలసీమ ఫ్యాక్షనిజం మాత్రమే కాదని పవన్ అన్నారు. యోగి వేమన, పుట్టపర్తి సాయిబాబా, నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి తదితరులు ఎందరో ఉన్నారన్నారు. వీరు కూడా ఏకవ్యక్తులు అని, కానీ వారు వ్యవస్థగా మారి ఎన్నో పరిష్కరించారని, అలాంటప్పుడు మనమంతా ఏకతాటి పైకి వస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఒక్కరి వల్ల ఏదీ సాధ్యం కాదన్నారు. అందరం కలిస్తే తప్పకుండా అనంత సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
నేను సంపాదించాలంటే సినిమాలు చాలు, దెబ్బలకు సిద్ధం
తనకు నిజంగా డబ్బు సంపాదించుకోవాలని ఉంటే సినిమాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే తాను ఎన్ని దెబ్బలు తినేందుకైనా తాను సిద్ధమని చెప్పారు. ఇది తనకు ఇష్టమే అన్నారు. తాను ఏ పార్టీకో అండగా లేనని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదని, కానీ తనను అభిమానించే ప్రజలకు ఏదైనా చేసేందుకే తాను దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
నేను ఎలా పని చేస్తున్నానో చూడండి, ఓటు వేయమనట్లేదు
నేను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలా పని చేస్తున్నానో మీరంతా చూసి, ఆ తర్వాత తనకు మద్దతివ్వండని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను జనసేనకు ఓటు వేయాలని మీకు చెప్పడం లేదని మీకు అండగా ఉంటానని, కాబట్టి తన వెనుక నిలబడమని మాత్రమే చెబుతున్నానని అన్నారు.
మీరుంటే ప్రభుత్వాలతో పని చేయిస్తా, మంత్రదండం లేదు
మీరు నా వెనుక ఉంటే ప్రభుత్వాలతో పని చేయించగలుగుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం తన వద్ద మంత్రదండం ఏమీ లేదని, కానీ చిత్తశుద్ధి ఉందని చెప్పారు. మీరు లక్షలాది మంది ఉన్నారని, నా వెనుక నిలబడితే మీకు అండగా ఉండి సమస్యలను పరిష్కరింప చేస్తానని చెప్పారు.
మీరు ఇచ్చే గుర్తింపు చాలు
తనకు ఎవరి జెండాలు, అజెండాలు మోయాల్సిన అవసరం, ఆవశ్యకత లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. మీరు ఇచ్చే గుర్తింపు నాకు చాలన్నారు. మరెవరి గుర్తింపు అవసరం లేదన్నారు. కానీ మీరు నాపై ఇంత ప్రేమ చూపించినప్పుడు ఈ అక్కాచెల్లెళ్ల రక్షణ బాధ్యత, యువత బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పారు. మీ నుంచి నేను కోరుకునేది ఒకటేనని, నాకు అండగా నిలబడండని, జనసేనకు ఓటు వేయమని మాత్రం అడగడం లేదని పునరుద్ఘాటించారు. అనంత కరువుపై పోరాడేందుకు నా పోరాడానికి మద్దతు మాత్రమే అడుగుతున్నానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి, ప్రభుత్వంతో మాట్లాడుతానని, నా దృష్టిలో అనంతపురం సమస్యలు ఉన్నాయని, కానీ మాట్లాడేందుకు తనకు కొంచెం సమయం ఇవ్వాలన్నారు.