పవన్ కళ్యాణ్ హావభావాలు: పంచ్ డైలాగ్స్ (ఫొటోలు)
హైదరాబాద్: తన రాజకీయ పార్టీ జనసేనను విడుదల చేస్తూ చేసిన ప్రసంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన హావభావాలు గబ్బర్ సింగ్ సినిమాను తలపించాయి. కుళ్లిన రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూ, పిచ్చి వేషాలు వేసే నేతల తాట తీయడానికే జనసేనకు ప్రాణం పోశానంటూ ఆయన భావోద్వేగాలతో కూడిన ప్రసంగం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, ఆయన కూతురు కల్వకుంట్ల కవిత, ఆయన కుమారుడు కెటి రామారావుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కెసిఆర్పై వ్యాఖ్యలు చేసే సమయంలో తెలంగాణ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించారు. తెలంగాణ ఇవ్వడంలో న్యాయం ఉందంటూనే రాష్ట్ర విభజన తీరుతో సీమాంధ్రులను అవమానించారని, తెలుగు ప్రజలను విడదీసి వెన్నుపోటు పొడిచిందని కాంగ్రెస్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
జనసేన పార్టీని స్థాపించాల్సిన విషయాన్ని వివరిస్తూనే వ్యక్తిగత విషయాలను కూడా తడిమారు. హావభావాలు, భావోద్వేగాలతో ఆయన ప్రసంగం సాగించారు. రాహుల్ గాంధీపై, సోనియా గాంధీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు అధిష్టానం పెద్దలు దిగ్విజయ్ సింగ్, చిదంబరం, జైరాం రమేష్, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీలపై తీవ్రంగా మండిపడ్డారు. వారి గురించి మాట్లాడేప్పుడు ఇంగ్లీషు భాషను ఆశ్రయించారు.
తెలుపు.. ఎరుపు.. ఖాకీ.. విప్లవం
తెలుపు.. ఎరుపు.. ఖాకీ.. ఇవీ పవన్ కళ్యాణ్ ఎంచుకున్న రంగులు. శాంతిని ప్రతిఫలించే తెలుపు రంగు నేపథ్యంలో ఎరుపు రంగులో నక్షత్రం, దాని మధ్యలో మళ్లీ ఎరుపు రంగులో మండే సూర్యుడు.
డ్రెస్లో జాగ్రత్త
తాను వేసుకున్న డ్రెస్కూడా చాలా జాగ్రత్తగా, విప్లవ మేధావులను గుర్తుకు తెచ్చేలా, గడ్డంతో.. తెలుపు రంగు పైజామాపై ఖాకీ లాల్చీ ధరించారు.
నేనే మొదటివాడిని..
దేశ సమగ్రతను దెబ్బ తీయాలని చూస్తే నేను సహించను. ఇప్పటిదాకా మతం కోసం చచ్చిపోయే జీహాదీలను చూసి ఉంటారని, ప్రాంతం కోసం, కులం కోసం చనిపోయిన వాళ్లను చూసి ఉంటారని, కానీ, సమాజం కోసం, దేశం కోసం చనిపోయే మొట్టమొదటి పిచ్చివాడిని తానే అవుతానని పవన్ కళ్యాణ్ అన్నారు.
దేశసమగ్రతను కాపాడుతా..
ఏ స్థాయి నాయకులైనా సరే... దేశ సమగ్రతను టచ్ చేస్తే, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఎండగడతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రాలుగా విడిపోయినా, మనమంతా అన్నదముల్లా కలిసి ఉండాలని అన్నారు. ఎవరు ఎక్కువ అనేది వదిలేయాలని, ఇలా చేసుకుంటే అభివృద్ధి రాదని అన్నారు. కొట్టుకు చస్తాం! విభజన రాజకీయాలు ఇక్కడితో ఆపండని సలహా ఇచ్చారు.
ఎకరాకు కోటి ఎలా?
విడిపోయిన తర్వాత కూడా సీమాంధ్ర ప్రజలను బూతులు తిడితే బంగారు తెలంగాణ రాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకు విధానాలు రూపొందించాలని అన్నారు. కెసిఆర్ ఎకరాకు కోటి ఎలా సంపాదిస్తున్నారో, తెలంగాణలోని ప్రతి రైతుకూ చెప్పాలని, అప్పుడు తాను కూడా కెసిఆర్కు జైకొడుతానని పవన్ కళ్యాణ్ అన్నారు.
బమ్మెర పోతన పద్యం..
బమ్మెర పోతన పద్యం చదివి, ఇదీ తెలంగాణ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. బొక్కలిరగగొడుతా, నాలుక కోస్తా అనేది తెలంగాణ భాష కాదని ఆయన అన్నారు.
కంచ ఐలయ్యకు కితాబు
కంచ ఐలయ్య భాషలో చెప్పాలంటే తెరాస నాయకులు ఫ్యూడలిస్టు వ్యవహారమని, తన భాషలో చెప్పాలంటే అది ఫ్యూడలిస్టు దురహంకారమని పవన్ కళ్యాణ్ అన్నారు.
జమ్ జంబల్బరీ..
జమ్ జంబల్బరీ అనే పాటను పాడే ప్రయత్నం చేశారు. గద్దర్ పాటను సీమాంధ్రలమైనా తాము ఆదరించామని, చొక్కాలు చించుకున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.
భగత్సింగ్ వారసులమంటూ..
తాను భగత్సింగ్ వారసుడినని పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారు. విప్లవ నేతలను, ముఖ్యంగా చెగువేరాను తలపించే గడ్డంతో ఆయన వేదిక మీదికి వచ్చారు.
భావం ముఖ్యం..
భాషను, యాసను అవమానించారని తెలంగాణవాళ్లు అంటున్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూ భాష ముఖ్యం కాదని, భావం ముఖ్యమని ఆయన అన్నారు.
కెమెరామెన్ గంగతో రాంబాబు
పవన్ కళ్యాణ్ ప్రసంగం కెమెరామెన్ గంగతో రాంబాబులో జర్నిలస్టు చేసిన ప్రసంగాన్ని తలపించింది. దేశం బాగోగులు తనపై ఉన్నట్లు ఆయన చెప్పుకున్నారు.
అన్నయ్యకు ఊరట..
తన ప్రసంగంలో అన్నయ్య చిరంజీవిపై ఎక్కడలేని ఆప్యాయతను కురిపించారు. అన్నయ్యను ఆ పరిస్థితికి తెచ్చింది ఢిల్లీ పెద్దలేనని ఆయన అన్నారు.
కాంగ్రెసు హఠావో దేశ్ బచావో
కాంగ్రెసు హఠావో, దేశ్ బచావో అనే నినాదం ఇచ్చి ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ప్రసంగం యావత్తూ తెరాసను, కాంగ్రెసును లక్ష్యం డైలాగులు విసిరారు. ప్రసంగం మొత్తం ఏకాపాత్రాభినయంలా సాగింది.