ఎవడబ్బ సొమ్ము?, బాబును కూడా ఇవే నీళ్లు తాగమనండి: నిప్పులు చెరిగిన పవన్!
Recommended Video
విజయనగరం: ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలను తీర్చడం కంటే ఎమ్మెల్యేల కొనుగోళ్ల పైనే ఆ పార్టీ ఎక్కువగా దృష్టి పెడుతోందని తాజా పర్యటనలో విమర్శించారు.జనసేన పోరుయాత్రలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా పార్వతీపురం, కురుపాం, బొబ్బిలి నియోజకవర్గాల్లో పవన్ పర్య టించారు.
నువ్వు గుండెల్లో ఉన్నావ్: పవన్ ఆసక్తికరం, బాబుకు వార్నింగ్, ఆధారాల్లేవని సుజయ కృష్ణ కౌంటర్
సీఎంను కూడా ఇవే తాగమనండి
పార్వతీపురంలో నిరసన కవాతు నిర్వహించిన పవన్.. స్థానిక నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెచ్చి ఇచ్చిన నీళ్ల బాటిళ్లను చూపిస్తూ.. వారి దయనీయ స్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం చంద్రబాబు నాయుడిని కూడా ఇవే నీళ్లు తాగమని చెప్పాలని ప్రజలకు సూచించారు.
అప్పుడు కానీ ఇక్కడి వారి బాధలు ఆయనకు తెలిసిరావన్నారు. ఇంత కలుషితమైన నీటిని తాగితే కలరా, అంటువ్యాధులు రాకుండా ఉంటాయా? అని ప్రశ్నించారు. పార్వతీపురానికి టీడీపీ నేతలు ఎవరు వచ్చినా ఇవే నీళ్లు ఇవ్వాలని అన్నారు. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
టీడీపీ పెద్దలు దోచుకుంటున్నారు
ఇక అగ్రిగోల్డ్ గురించి ప్రస్తావిస్తూ పేద ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను తెలుగుదేశం పార్టీలోని పెద్దలు కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల తరుపున జనసేన బలమైన పోరాటం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని, దీనికి చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు.
అగస్టులో మేనిఫెస్టో..:
వచ్చే ఆగస్టు నెలలో జనసేన మేనిఫెస్టోపై స్పష్టత ఇస్తామని పవన్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి పరిశ్రమల ఆవశ్యకత ఉందని.. తాను అధికారంలోకి వస్తే ఫిల్మ్ ఇండస్ట్రీని విజయనగరంలో స్థాపిస్తానని హామి ఇచ్చారు. విజయనగరం రాజుల గురించి ప్రస్తావిస్తూ.. రాజులంటే తనకు గౌరవం ఉందని, రాజరికాలు, సంస్థానాలు రద్దు చేయడం వల్లే ప్రజాస్వామ్య రాష్ట్రాలు ఏర్పడ్డాయని పవన్ పేర్కొన్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అశోకగజపతిరాజు అన్న తనకు బాధ కలగలేదని అన్నారు.
ఎవడబ్బ సొమ్ము:
ప్రత్యేక హోదాపై జనసేన చేపడుతున్న కవాతు ఢిల్లీని తాకాలని కార్యకర్తలకు పవన్ పిలుపిచ్చారు. తోటపల్లి, జంఝావతి సమస్యలను పరిష్కరించేందుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టుకు వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తోందని ప్రశ్నించారు.
ఇక హెరిటేజ్ సంస్థకు రూ.500కోట్ల రాయితీ ఇచ్చారని, కానీ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు మాత్రం ప్రభుత్వం నిధులు లేవంటోందని అన్నారు. నవ నిర్మాణ దీక్షకు రూ.కోటి కేటాయించడం ఎవడబ్బ సొమ్ము అని ప్రశ్నించారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో వందలాది మంది బోధకాల వ్యాధితో బాధపడుతున్నారని, దీని కారణాలను అన్వేషించడానికి రీసెర్చ్ సెంటర్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.