ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు దేనికోసం .. మొన్న చిన్నారి, నేడు దివ్య తేజస్విని : పవన్ కళ్యాణ్ ఫైర్
విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దివ్య తేజస్విని ప్రేమోన్మాది దాడిలో బలి కావడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు చేసి ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ప్రేమోన్మాది దాడిలో దివ్య తేజస్విని మృతి అత్యంత హృదయవిదారకమని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఏడాది కాలంగా మరుగుదొడ్డిలో మహిళ నిర్బంధం .. భార్యపై భర్త అమానుషం
తేజస్విని మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్
విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని ఒక ప్రేమోన్మాది దాడిలో బలై పోయిందని తెలిసి బాధపడ్డానని చెప్పిన ఆయన, రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు ,హత్యలు,మహిళలపై దాడులపై తీవ్రంగా మండిపడ్డారు. తన ఉన్నతవిద్యను పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఎన్నో ఆశలతో ఉన్న, కలలు కన్న తేజస్వినిపై ఈ ఘాతుకం ఆమె తల్లిదండ్రులకు కడుపు శోకాన్ని మిగిల్చింది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో వరుస ప్రేమోన్మాదుల దాడులపై మండిపడిన పవన్
మొన్నటికి మొన్న చిన్నారి అనే నర్సుపై ప్రేమ పేరుతో ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటుచేసుకుందని, అది మరిచిపోకముందే ఇప్పుడు దివ్య తేజస్వినిని ప్రేమోన్మాది బలి తీసుకున్నాడని పవన్కళ్యాణ్ మండిపడ్డారు. మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో యువతులు విద్యార్థినులపై లైంగిక వేధింపులు , అత్యాచారాలు, హత్యలు పెరుగుతుండడం దురదృష్టకరమని పేర్కొన్న పవన్ రాష్ట్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు.
దిశ చట్టం ద్వారా ఏం సాధించారని ప్రశ్న
రాష్ట్రంలో మహిళల మీద దాడులను అరికట్టడం కోసం కఠిన చట్టాన్ని చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం దిశ చట్టం ద్వారా ఏం సాధించింది అంటూ ప్రశ్నించారు? ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేని చట్టాలు దేనికోసం అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అంతేకాదు అత్యాచార ఘటనలు విషయంలో పోలీసుల స్పందన కూడా బాలేదని చాలా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అందుకు ఉదాహరణలు కూడా చెప్పారు.
నిందితులకు కఠిన శిక్షలు పడితేనే చట్టాలపై నమ్మకం
తిరుపతిలో ఒక యువతి ఒక మత ప్రచారకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోలేదని, బాధితురాలు స్పందనలో ఫిర్యాదు చేస్తే, అప్పుడు పోలీసులు స్పందించారు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం చట్టాలను గట్టిగా ప్రయోగించాలని, పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు విధించినప్పుడే మహిళలకు రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాల మీద నమ్మకం కలుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల విషయంలో నేరస్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.