జగన్! లాక్డౌన్ వేళ వారందర్నీ ఆదుకుంటారా? లేదా?: పవన్ కళ్యాణ్
అమరావతి: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్తో అన్ని పనులు ఆగిపోయాయని, దీంతో కూలీలు, భవన కార్మికులు, ఉద్యాన, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
ఆ 30 లక్షల మంది కార్మికులు పరిస్థితి ఏంటి?
మంగళవారం ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో 21 లక్షల మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, మరో 30 లక్షల మంది వరకు గుర్తింపు పొందని కార్మిలున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు నిధులు విడుదల చేసేలా కేంద్ర కార్మిక శాఖ మంత్రి లేఖలు రాశారని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా రోజువారీ కూలీలు తమ జీవనాధారాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు పొందిన కార్మికులకు మాత్రమే సాయం అందుతోందని, మరి గుర్తింపు పొందని లక్షల మంది అర్హులైన కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని అన్నారు. ఈ మూడు రంగాల కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో గుర్తింపు పొందినవారితోపాగు గుర్తింపుపొందని కార్మికులను కూడా జగన్ ప్రభుత్వం ఆదుకుంటోందా? అని ప్రశ్నించారు.
రూ. 3000 కోట్ల నిధి సంగతేంటి?
ఇక రాష్ట్రంలో 17.62 లక్షల హెక్టార్లలో ఉద్యానపంటలు సాగవుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. యేటా 327.57లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అవుతోందని, ప్రస్తుతం ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా అరటి రైతులు పంటను కోల్పోయే ప్రమాదముందన్నారు. అరటి పంట సాగు కోసం ఇప్పటికే రైతులు భారీగా పెట్టుబడి పెట్టారని, ప్రస్తుతం పంట చేతికొచ్చే దశలో ఉందని అన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో మార్కెట్లన్నీ మూసేశారని, అరటి పంట జీవిత కాల కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు. వెంటనే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రైతుల నుంచి పంటను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని పవన్ కళ్యాణ్ జగన్ సర్కారును ప్రశ్నించారు. ప్రభుత్వం రూ. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి అంటూ ప్రకటించిన నేపథ్యంలో రైతులను ఆదుకుంటుందా? అని ప్రశ్నించారు.
ఆక్వా రైతుల కోసం జగన్ సర్కారు ఏం చేస్తుంది?
ఆక్వా రైతుల గురించి ప్రస్తావిస్తూ.. దేశంలోనే ఏపీ ఆక్వా ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉందన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 14.5 లక్షల మంది ఆక్వా రంగంలో పని చేస్తున్నారని, రాష్ట్ర జీఎస్ డీపీలో ఆక్వా పరిశ్రమ వాటా 7.4శాతంగా ఉందన్నారు. అయితే, ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వీరందర్నీ ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయించాలన్నారు. అయితే, ఆక్వా రైతులకు పూర్తిస్థాయి మద్దతు ధర లభించేలా ఎలాంటి జగన్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇందుకు ప్రణాళికలు ఏమైనా రూపొందించారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ సర్కారు పవన్ మూడు ప్రశ్నలపై స్పందించాల్సి ఉంది.
వీరి సమస్యలను పరిష్కరించండి..
కర్నూలు జిల్లాలో కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. ఓ మహిళ మాట్లాడుతున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. తమను ఆదుకోవాలంటూ సదరు మహిళ ఆ వీడియోలో ప్రభుత్వాన్ని కోరుతోంది. కర్నూలు పార్లమెంటేరియన్స్, ఏపీ ప్రభుత్వం వీరిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు.