మీకూ వైసీపీకి తేడా ఏంటి?, మీ 40ఏళ్ల అనుభవం అక్కడే తేలిపోయింది: పవన్
విజయనగరం: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆయన గళమెత్తారు. కార్మిక సమస్యలు, ఉపాధి, అక్రమ మైనింగ్ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
Recommended Video
అనుమతులు లేకుండా ఎవరి ఇష్టానికి వారు మాంగనీస్ గనులు తవ్వుకుపోతున్నారని పవన్ ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వా ఖజానాకు నష్టం వాటిల్లుతోందని, తెలుగుదేశం నాయకులు మాత్రం లాభపడుతున్నారని విమర్శించారు. ఇదంతా అవినీతి కాదా? అని ప్రశ్నించారు.
మీకూ వైసీపీకి తేడా ఏంటి?
మైనింగ్ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి మరీ మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారని పవన్ ఆరోపించారు. 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి ప్రధాన కారణం.. అవినీతికి తావు లేని పాలన అందిస్తారన్న భరోసానే అని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తరహాలో అవినీతి పెరిగిపోతుందని, భూకబ్జాలు పెరిగిపోతాయని భావించానని చెప్పారు. కానీ ఇప్పుడు వైసీపీకి, టీడీపీకి తేడా ఏంటని ప్రశ్నించారు.
40ఏళ్ల అనుభవం అక్కడే తేలిపోయింది..:
అనుమతులు లేకుండా మైనింగ్స్, ఖనిజాలు తవ్వేస్తున్నా.. టీడీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. చంద్రబాబు గారి 40ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఇసుక మాఫియా ముందు తేలిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, మీ అబ్బాయి లోకేశ్ కు మాత్రమే ఉద్యోగం ఇస్తే సరిపోదని పవన్ ఎద్దేవా చేశారు. కార్మికులకు భద్రత కావాలని, వారికి జీవిత భీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ఒక్క జనసేన తప్ప మరే పార్టీ మాంగనీస్ కార్మికుల కష్టాలను పట్టించుకోలేదన్నారు.
జెండా మోస్తేనే పదవులు అడుగుతున్నారు..:
జెండా మోస్తేనే పదవులు ఆశించే ఈరోజుల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టి కూడా తాను ఏమి ఆశించలేదని పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కి ఏమి అవసరం లేదని, జనసేనకి కూడా ఏమి అవసరం లేదని, కానీ కార్మికులకు మాత్రం ఉపాధి భద్రత, జీవిత భీమా కావాలని డిమాండ్ చేశారు. చీపురుపల్లిలో పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
రెచ్చగొట్టడం కాదు.. బాధితులకు అండగా నిలుస్తున్నా..:
అన్ని అమరావతికే తరలించేస్తున్నారని, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలను పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. ఇక తాను ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నానన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తనదే గనుక రెచ్చగొట్టే తత్వమే అయితే టీడీపీకి ఎందుకు మద్దతునిచ్చేవాడిని అని ప్రశ్నించారు. సమస్యలు ఎక్కడున్నా.. బాధితులు ఎక్కడున్నా.. వారి తరుపున మాట్లాడుతామని పవన్ స్పష్టం చేశారు.
భయపడేది లేదు.. మడమ తిప్పేది లేదు
సీఎం గానీ వారి కుటుంబీకులకు గానీ మంత్రులకు గానీ ఇసుక మాఫియాలో ఎంటరై ఉండకపోతే.. నేనెందుకు అడ్డుపడేవాడినని నిలదీశారు. అప్పుడు ఇంకో 20 ఏళ్లు మీరే సీఎంగా ఉన్నా నేను అడ్డుపడేవాడిని కాదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం కచ్చితంగా నిలదీస్తామని, అందుకు భయపడేది లేదని, మడమ తిప్పేది లేదని స్పష్టం చేశారు. అసలే వలసలతో చితికిపోతున్న ఉత్తరాంధ్రకు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను పంపించడమేంటని ప్రశ్నించారు.