300 ఖాతాలు తొలగిస్తే... 3000 సృష్టిస్తాం: జన సైనికుల హెచ్చరిక, పవన్ స్పందన ఏమిటంటే!
సోషల్ మీడియాలో జనసేన ట్విట్టర్ అకౌంట్ల తొలగింపు అంశం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వందలకు పైగా అకౌంట్లను సస్పెండ్ చేస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకోవడంపై జనసైనికుల నుంచి అగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో అకౌంట్ల తొలగింపుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన ట్విట్టర్లో ఏమని కామెంట్ చేశారంటే..
400 ట్విట్టర్ ఖాతాలు తొలగింపు
గత కొద్ది రోజులుగా ట్విట్టర్ ఖాతాలపై దృష్టి సారించిన ట్విట్టర్ యాజమాన్యం నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఖాతాలను తొలగిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం దేశవ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఖాతాలను తొలగించింది. తాజాగా జనసేన పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సుమారు 400 ఖాతాలను నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయంటూ ట్విట్టర్ సస్పెండ్ చేసింది.
ప్రశ్నించిన పవన్ కల్యాణ్
ట్విట్టర్ ఖాతాల తొలగింపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఖాతాలను ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నించారు. 400 ట్విట్టర్ ఖాతాలను ఎందుకు నిలిపివేశారో నాకు అర్థం కావడం లేదంటూ పేర్కోన్నారు. అవసరాల్లో ఉన్న సామాన్యుల తరపున పోరాడుతున్న వారి ఖాతాలను నిలిపివేస్తారా అంటూ అవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యను తాము ఎలా అర్థం చేసుకోవాలి అంటూ .. bringback jspsocialmedia అనే హ్యాష్ ట్యాగ్ను యాడ్ చేశారు.
జన సైనికుల ఆగ్రహం
అయితే ఈ ఖాతాల తోలగింపుపై జనసేన కార్యకర్తలు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో పలు అంశాలపై ప్రచారం నిర్వహిస్తున్న జనసేనకు అడ్డుకట్టవేసేందుకే ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపణలు చేశారు. అధికార పార్టీ కుట్రతోనే ట్విట్టర్ ఖాతాలు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వందల ఖాతాలు తొలగిస్తే... మూడు వేల ఖాతాలు సృష్టిస్తామని అన్నారు. ముఖ్యంగా పార్టీ ప్రచార కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ సోషల్ మీడీయాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం
ఇక తాజాగా నల్లమలలో కేంద్రప్రభుత్వం చేపట్టిన యురేనియం తవ్వకాలపై పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పోరాడుతున్నారు.ఇందుకోసం ఆయన అఖిలపక్ష సమావేశం కూడ ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఓ వనవాసి అనే పుస్తకాన్ని కూడ పోస్ట్ చేశారు. ఈ పుస్తకం చదవిన వారు ఎవరైన ప్రకృతిని ప్రేమిస్తారని చెప్పారు. తనకు ప్రకృతిపై ఉన్న ప్రేమకు ఈ పుస్తకమే నిదర్శమని ట్విట్టర్లో పేర్కోన్నారు.ఆయన ప్రయత్నాల నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం తవ్వకాలను నిలిపివేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపించింది.