నిమ్మగడ్డ తీర్పుపై స్పందించిన పవన్.! ప్రజాస్వామ్యానికి కోర్టు తీర్పు ఊపిరి పోసిందన్న జనసేనాని.!
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కరాజకీయ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చురుగ్గా స్పందిస్తున్నారు. కరోనా బాదితులు, తిరుమల భూములతో పాటు ప్రభుత్వ విధానాల మీద ఘాటుగా స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్ల ఏపి హైకోర్ట్ ఇచ్చిన తీర్పును జనసేనాని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇలాంటి తీర్పులు ప్రజాస్వామ్యానికి ఊపిరిలు పోస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయాలన్ని వ్యక్తం చేసారు.
Recommended Video
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్: ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ ఇన్..
నిమ్మగడ్డ రమేష్ పై హైకోర్ట్ తీర్పు..
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసిందని జనసేనాని అభివర్ణించారు. ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసాన్ని ఇనుమడింపచేసే విధంగా ఈ తీర్పు ఉందన్నారు పవన్ కళ్యాణ్. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను ప్రభుత్వాలు తమకు నచ్చిన విధంగా మార్చుకోవాలని చూస్తే న్యాయ విభాగాలు రక్షిస్తాయనే విషయాన్ని రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా మరోసారి రుజువైందన్నారు పవన్ కళ్యాణ్.
ప్రభుత్వం పంతాలకు వెళ్తే చేదు అనుభవాలు తప్పవు..
రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని పంతాలకు వెళ్లకుండా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి కొనసాగించాలనే తీర్పును తక్షణమే అంగీకరించి- రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలని జనసేనాని ఏపి ప్రభుత్వానికి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభీష్టానికి భిన్నంగా వెళ్లారనే కారణంతోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పట్ల ఏపి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరించిందని పవన్ గుర్తు చేసారు. ఆ రోజు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ హోదాలో కరోనా విపత్తు ఎంత ప్రమాదకరమైనదో గ్రహించి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేశారని పవన్ పేర్కొన్నారు.
వ్యక్తుల కన్నా వ్యవస్థలు గొప్పవి..
ఆ సందర్బంలో ఏపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరుని ప్రజాస్వామ్యవాదులెవరూ హర్షించలేదని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారిపై ముఖ్యమంత్రితో పాటు, అధికార పక్షానికి చెందిన నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు వారి వైఖరిని వెల్లడించాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా వైరస్ తో అందరూ ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్ ను తప్పించే ప్రక్రియపై దృష్టిపెట్టి రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్స్ ను కూడా పరిగణనలోకి తీసుకోలేదని పవన్ మండిపడ్డారు.
నియంతృత్వ ధోరణి పనికిరాదు..
ఇప్పటికైనా ప్రభుత్వాలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయడం, నిర్ణయాలు తీసుకోవడం అవసరం అని హైకోర్ట్ తీర్పు ద్వారా తెలుసుకోవాలని పవన్ హితవు పలికారు. ఏకస్వామ్య ప్రభుత్వంగానో, నియంతృత్వ ధోరణితోనో పాలన సాగిస్తే న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యానికి రక్షణ లభిస్తుందన్న బృహత్కర సత్యాన్ని గ్రహించాలని జనజేనాని సూచించారు. అధికార యంత్రాంగం కూడా పాలకులకు రాజ్యాంగం గురించీ, చట్టం గురించీ అవగాహన కల్పించాలని, లేదంటే న్యాయ స్థానాల ముందు జవాబు చెప్పుకోవాల్సింది అధికార యంత్రాంగమే అన్న అంశం మరువకూడదని వైసీపి ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు.