ఇప్పుడా.. అఖిలపక్షానికి రాం: చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్, టీడీపీది అత్యుత్సాహమా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి ఘాటు లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై అధికార పార్టీ రేపు (బుధవారం) అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని పార్టీలను ఆహ్వానించింది. దీనిపై జనసేనానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేనాని సూటి ప్రశ్న
రేపటి అఖిల పక్షానికి జనసేన దూరంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. మొక్కుబడి అఖిల పక్షాలకు తాము దూరంగా ఉంటామని చెప్పారు. బలమైన పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు. రేపు మీటింగ్ పెట్టి ఈ రోజు ఆహ్వానాలు పంపడం ఏమిటని ఆ లేఖలో జనసేనాని సూటిగా ప్రశ్నించారు.
రాజకీయ లబ్ధి కోసమే
అజెండా లేకుండా ఏర్పాటు చేసిన చర్చ మొక్కుబడి వ్యవహారం అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అఖిల పక్ష సమావేశానికి హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం సంఘటితంగా పోరాటం చేసేందుకు జనసేన సిద్ధమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పోరాటంలో చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే జనసేన పార్టీ మద్దతిస్తుందని చెప్పారు. హోదా కోసం అందరూ కలిసి రావాలన్నారు.
టీడీపీది తొందరపాటా?
కాగా, ఇటీవల పవన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో వేరుగా పోటీ చేద్దాం.. ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పోరాడుదామని చంద్రబాబు, జగన్లకు పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అఖిల పక్షానికి దూరం జరగడానికి కారణం ఉందని అంటున్నారు. ఈ రోజు ఉండవల్లి నేతృత్వంలో అఖిలపక్షం జరిగింది. కాబట్టి మరొకటి అనవసరమని చెప్పవచ్చునని అంటున్నారు. అలాగే, రేపు అఖిల పక్షమని చెప్పి, ఈ రోజు ఆహ్వానించడం కూడా సరికాదని, సరైన ప్లాన్ లేకుంటే ఎలా అని అంటున్నారు. దీంతో ఇది టీడీపీ తొందరపాటు చర్యగా లేక ఉండవల్లి అఖిలపక్షాన్ని కార్నర్ చేసేదిగా కనిపిస్తోందని అంటున్నారు.