రామతీర్ధం కొండపై రామకొలనులో స్వామి శిరస్సు లభ్యం .. విగ్రహ ధ్వంసం ఘటన పై స్పందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రామతీర్థం లోని బోధికొండపై సుమారు 400 ఏళ్ల క్రితం నాటి శ్రీరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు తల భాగాన్ని వేరు చేసి ఎత్తుకెళ్లిన ఘటనపై విజయనగరం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ ఘటనను సీరియస్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో స్పందించారు . మరో వైపు రాముని విగ్రహ శిరస్సు లభ్యం అయ్యింది
రామతీర్ధం రాములవారి విగ్రహ ధ్వంసం ఘటన .. సీరియస్ అయిన మంత్రి వెల్లంపల్లి , అధికారులకు ఆదేశాలు
రామతీర్థంలో రాముడు విగ్రహ ధ్వంసం ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్
రామతీర్థంలో రాముడు విగ్రహ ధ్వంసం ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గత కొంతకాలంగా హిందు విగ్రహాలపై దాడులను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. కోదండరామ స్వామి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాములవారి విగ్రహం ధ్వంసం చేసిన విధానం స్వామి శిరస్సు కనిపించకుండా పోవడం తెలుసుకుంటే చాలా బాధ కలుగుతుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాద చర్య అన్న పవన్ కళ్యాణ్
మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాద చర్యగా దీనిని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. జగన్ ఏ మతాన్ని ఆచరించినా, పర మతాన్ని గౌరవించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. గతంలో ఆలయాలపై జరిగిన దాడులు పట్టించుకోకపోవడం వల్లే, ప్రస్తుత ఆలయాలపైన దాడులు కొనసాగుతున్నాయని పవన్ పేర్కొన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఆలయాలపై జరుగుతున్న దాడులపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలన్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదిగా జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై దాడులపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. సీఎం జగన్ నిర్లక్ష్య వైఖరికి ఆలయాలపై దాడులు పరాకాష్టగా మిగిలాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ విజయనగరం పర్యటన నేపధ్యంలో ఈరోజు విజయనగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
స్వామి విగ్రహం శిరస్సు లభ్యం
మరోపక్క స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేసి తల భాగాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు ఎక్కడ పడేసారు అన్న దానిపై పోలీసులు చేసిన దర్యాప్తులో ఎట్టకేలకు తల భాగం దొరికింది. ఈ క్రమంలో రాములవారి విగ్రహ శిరస్సు భాగం రామ కొలనులో లభ్యమైంది. నిన్నటి నుంచి రామ కొలనులో గాలిస్తున్న సిబ్బంది ఎట్టకేలకు రాముల వారి తల భాగాన్ని కొలను నుండి బయటకు తీశారు. మరోవైపు రాముల వారి విగ్రహ పునః ప్రతిష్టకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.