ఢిల్లీలో జగన్ కలిసింది బీజేపీ నేతలను కాదట .. పొత్తులపై కొత్త లెక్కలు చెప్పిన పవన్
ఏపీలో వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకోనున్నాయి. అందుకే జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు అన్న ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వార్తలపై తనదైన శైలిలో స్పందించారు. నేడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీ అధికారపార్టీతో జత కడితే అన్న అంశంపై స్పందించారు. బీజేపీతో జనసేన బంధం చాలా ధృడంగా ఉందని ఆయన చెప్పారు. త్వరలోనే బీజేపీతో కలిసి ఉద్యమాలు చేస్తామని, రాజధాని ప్రాంత రైతులకు బాసటగా నిలుస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు .
జనసేనకు తలనొప్పిగా జగన్ హస్తిన టూర్లు .. రీజన్ ఇదే
జగన్ కలిసింది భారతీయ ప్రభుత్వ అధినేతలను అన్న పవన్
ప్రస్తుతానికి బీజేపీ-జనసేన బంధం బలంగా వుందని చెప్పిన జనసేనాని పవన్ జనసేన బీజేపీల మధ్య గ్యాప్ వచ్చింది అన్న అపోహలకు చెక్ పెడుతూ భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తాయని అన్నారు . ఢిల్లీలో జగన్ కలుస్తున్నది భారతీయ జనతాపార్టీ నేతలను కాదు అన్న ఆయన భారతీయ ప్రభుత్వ అధినేతలను కాబట్టి అందులో వేరే ఊహాగానాలు అవసరం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్
రాజధాని విషయంలో బీజేపీ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే తాను కమలం నేతలతో కలిశానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. త్వరలోనే బీజేపీ నేతలతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటనకు వస్తానని చెప్పిన ఆయన రాజధాని రైతులకు ఇచ్చిన మాట మేరకు నేడు అమరావతి ఆ ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు . భారీ ఎత్తున వచ్చిన జనసేన శ్రేణులతో కలిసి రాజధాని ఏరియాలోని తుళ్ళూరు, మందడం, ఉద్దండరాయుని పాలెం గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ అక్కడ ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు .
తాను రైతుల వెంటే ఉంటానన్న పవన్
రాజధాని కోసం దీక్షలు చేపట్టిన రైతులకు సంఘీభావం తెలిపిన జనసేనాని పవన్ రాజధాని రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రాజధాని విషయంలో బీజేపీ పెద్దలతో తాను మాట్లాడానని, బీజేపీ కూడా అమరావతికి కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఎవరు వచ్చినా రాకపోయినా...తాను రైతుల వెంటే ఉంటానని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో కేంద్రం కూడా కొన్ని విషయాల్లో ఏమీ చేయలేని పరిస్థితులుంటాయని అన్నారు.