అందుకే పీఆర్పీరాలేదు, కెసిఆర్ ఎందుకు తిడ్తారో: పవన్
చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు. అదే సమయంలో వైయస్ వైఫల్యం వల్లే 2004లో రాని ప్రజారాజ్యం పార్టీ 2009లో వచ్చిందని చెప్పారు. ఆయన చిత్తూరు జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు.
2004 వరకు చంద్రబాబు పాలనలో ప్రజారాజ్యం పార్టీ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. కాంగ్రెసు పార్టీ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నందు వల్లే 2009లో తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారన్నారు. చంద్రబాబు హయాంలో పూర్తిగా అన్యాయం జరిగితే 2004లోనే పుట్టుకు వచ్చేది కదా అని ప్రశ్నించారు. తాను కూడా అప్పుడే రాజకీయాల్లోకి వచ్చే వాడినన్నారు.
చంద్రబాబు హయాంలో కొన్ని సమర్థవంతంగా పరిష్కరించలేకపోయారనేది నిజమని, దానిని వైయస్ ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చారన్నారు. అయితే వాటిని ఆయన కూడా పరిష్కరించక పోగా, రాష్ట్రాన్ని దోచేశారని అభిప్రాయపడ్డారు.
తాను కెసిఆర్లా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు తన నాలుకలో విషం లేదన్నారు. కెసిఆర్ వల్ల అసహనం, ఆక్రోశం వచ్చి తాను కూడా తిడుతూ ఎదురు దాడికి దిగానన్నారు. తెరాస వల్ల సినిమా పరిశ్రమతో పాటు ఎన్నో ఆగిపోయాయన్నారు. సీమాంధ్రులకు భద్రత లేని పరిస్థితి హైదరాబాదులో వచ్చిందన్నారు. చివరకు తన తల్లి కూడా భయపడిందన్నారు.
చివరకు తెలంగాణ వచ్చాక కూడా రెచ్చగొట్టేలా కెసిఆర్ మాట్లాడారని, అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తనకు తెగింపు ఎక్కువ అని, ప్రాణాలకు లెక్క చేయనని చెప్పారు. తాను కెసిఆర్లు ఇష్టం వచ్చినట్లు ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి లాభపడాలనుకునే వ్యక్తిని కాదన్నారు.
కెసిఆర్ సీమాంధ్ర ప్రజలను ఎందుకు తిడుతున్నారో ఇప్పటి వరకు తనకు అర్థం కాని విషయమన్నారు. కొంతమంది నాయకులు, వారి కుటుంబ సభ్యులు చేసిన తప్పుకు సీమాంధ్రులను ఎలా తిడతారని ప్రశ్నించారు. ప్రతి సమస్యకు సీమాంధ్రులే అంటున్న కెసిఆర్.. ఫ్లోరైడ్ సమస్య కూడా అందువల్లేనా అని ప్రశ్నించారు. దానిపై ఎందుకు దృష్టి పెట్టరని అభిప్రాయపడ్డారు. వైయస్ అవినీతి వల్ల మనపై దోపిడీ ముద్ర పడిందన్నారు.
చంద్రబాబు హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్కు తెలంగాణ ఎందుకు గుర్తుకు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. పాలించిన వ్యక్తులను అనుకోవచ్చు కానీ ప్రజలను ఎలా అంటారన్నారు. సీమాంధ్రులకు ధైర్యం, తెగింపు తక్కువ ఉన్నాయా అని ప్రశ్నించారు. అంటే తాట తీస్తానని హెచ్చరించారు. సీమాంధ్ర తనకు కన్నతల్లి అయితే తెలంగాణ పెంచిన తల్లి అన్నారు. ఇరువురు తనకు సమానమేనని చెప్పారు.