సీఏఏపై స్పందించిన పవన్ కళ్యాణ్: ఏమన్నారంటే..?, జనసైనికులకు కీలక సూచనలు
హైదరాబాద్: గత కొద్ది నెలలుగా భారతీయ జనతా పార్టీతో పొత్తుపై అగ్రనేతలతో చర్చలు జరిపామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. శనివారం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బీజేపీతో పొత్తు చాలా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పారు.
ఇప్పుడు తెలంగాణపై ఫోకస్
తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పుడు పార్టీని తెలంగాణలో బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించుకుందామని, అర్హులైన పేర్లను కార్యకర్తలే సూచించాలన్నారు. కమిటీల ఏర్పాటు కూడా కార్యకర్తల అభీష్టమేరకు జరుగుతుందన్నారు.
బీజేపీ పొత్తుపై పవన్..
ఈ సందర్భంగా బీజేపీతో పొత్తుపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. బీజేపీలోని అన్ని స్థాయిల నాయకులతో చాలా లోతైన చర్చలు జరిపిన తర్వాతే తెలుగు రాష్ట్రాలు, మనదేశ దీర్ఘకాల ప్రయోజనాలు, ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం పొత్తు ఏర్పాటు జరిగినట్లు తెలిపారు. పొత్తుపై ఇరుపక్షాల నుంచి ఎటువంటి షరతులు లేవని చెప్పారు.
జనసైనికులు పూర్తి అవగాహనతో..
నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీతో కలిసి పనిచేసినట్లు గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. లేని పక్షంలో అపోహలకు గురయ్యే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు.
సీఏఏపై పవన్ కళ్యాణ్..
ఉదాహరణకు పౌరసత్వ సవరణ చట్టం(సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్-సీఏఏ)ను అర్థం చేసుకోవడంలో చాలా మంది కొంత అపోహలకు గురవుతున్నారని చెబుతూ.. ఈ చట్టం వల్ల దేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లింకు అపకారం జరగదని స్పష్టం చేశారు. సీఏఏ చట్టం రూపకల్పనకు దేశ విభజన నాటి పరిస్థితులే కారణమన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య గల ఒప్పందాల గురించి పవన్ కళ్యాణ్ వివరించారు. ఆనాటి ఒప్పందాలను పొరుగు దేశం అమలు చేయకపోవడం కారణంగా అక్కడి మైనార్టీల రక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చిందన్నారు.
తెలంగాణ కోసం సమయం..
ఇక నుంచి నెలల కొన్ని రోజులపాటు తెలంగాణలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ గ్రేటర్ కమిటీని కార్యకర్తల నుంచి అందిన వెంటనే ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జీ శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.