పట్టలేనంత ఆనందంగా ఉంది: పవన్ కళ్యాణ్, జనసేన సత్తా ఏంటో చాటారంటూ జనసేనాని
అమరావతి: గ్రామీణ స్థాయిలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందనే విషయాన్ని పంచాయతీ ఎన్నికల ఫలితాల గణంకాలే రుజువు చేస్తున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మొదటి విడతలో 18 శాతానికి పైగా ఓట్లు వస్తే... రెండో విడతలో అది 22 శాతం దాటిందని వెల్లడించారు.
అన్నింటికీ ఎదురొడ్డి నిలిచారు.. మీరు గర్వకారణం
'జనసేన పార్టీ భావజాలం, పార్టీ శ్రేణుల మద్దతుతో రెండో దశలో 250కి పైగా సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలు గెలిచాం. 1500 పైగా పంచాయతీల్లో రెండో స్థానంలో నిలిచాం. 1500 వార్డులను కైవసం చేసుకున్నాం. ఈ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలకు తట్టుకొని యువత, ఆడపడుచులు నిలబడటం నిజంగా గర్వకారణం. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలియచేస్తున్నాను. పోటీలో నిలిచినవారికి జనసైనికులు, నాయకులూ అండగా నిలిచారు. జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైంది. మార్పు మొదలయ్యేటప్పుడే భయపెడతారు. అధికార పక్షంవాళ్ళు మజిల్ పవర్ చూపిస్తున్నారు'అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
వాలంటీర్లతో బెదిరింపులా?
'గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారు. వాలంటీర్ల పరిధిలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని వాళ్లతో రకరకాల బెదిరింపులకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ప్రత్యర్థులను కూడా కిడ్నాప్ చేయిస్తున్నారు. కడప జిల్లాలో జనసేన పార్టీ మద్దతుదారుడిని కిడ్నాప్ చేయడం బాధాకరం' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
151 ఎమ్మెల్యేలు ఉండి.. జనసేనకు భయపడుతున్నారా?
'151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా జనసేన పార్టీ అంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మా వాళ్లను బెదిరిస్తున్నారు. జనసైనికులు, ఆడపడుచులకు ఒకటే చెబుతున్నాను, మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా మేము ఉన్నాం. మార్పు రాబోయే ముందు అధికారపక్షానికి చాలా భయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనువైన మార్పును జనసేన పార్టీ తీసుకొస్తుంది' అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఆడపడచుల ఉత్సాహం చూస్తే సంతోషంగా ఉంది: పవన్ కళ్యాణ్
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని సంఘటనలు మనసును బలంగా హత్తుకున్నాయి. తాడేపల్లి సమీప గ్రామమైన పెద్దకొండూరు పంచాయతీ సర్పంచ్ స్థానంలో దళిత వర్గానికి చెందిన విద్యాధికురాలు మేడిది సౌజన్య విజయం, నరసరావుపేట నియోజకవర్గం పమిడిపాడు పంచాయతీ సర్పంచుగా షేక్ గౌసియా బేగం గెలుపు, తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం అర్జునుడిపాలెం పంచాయతీ సర్పంచుగా పోతుల గంగాధర రావు జయకేతనాన్ని సంబరంగా చేసుకున్న ఆ ఊరి ఆడపడుచుల ఉత్సాహం చూస్తే ఎంతో సంతోషం కలిగిందన్నారు పవన్ కళ్యాణ్.
వీర మహిళ విజయం.. మటల్లో చెప్పలేనిఆనందం..
'శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధి పీడిత ప్రాంతమైన ఉద్ధానంలో జనసేన జెండా రెపరెపలాడటం సంతోషాన్నిచ్చింది. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం కోరుకొల్లు పంచాయతీ సర్పంచుగా ఎన్నికైన లీలా కనకదుర్గ గారి దృఢ సంకల్పం స్ఫూర్తిదాయకం. ఆమె నిండు గర్భిణిగా నామినేషన్ వేయడం, ప్రచారం పరవళ్లు తొక్కించి పోలింగ్ రోజు ఓటు వేసి వెళ్లి ఆస్పత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఒక మహిళ తన గ్రామం కోసం ఇంతలా కష్టపడిన విధానం నిజంగా ప్రశంసనీయం. ఆమె విజయాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ విజయాలు చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. గెలిచిన వారందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు మంచిది కాదని హితవు పలికారు.