జనసేన విజయాలు అసామాన్యం: శాసించే స్థాయికి ఎదగాలంటూ పవన్ కళ్యాణ్
అమరావతి: పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు... అలాంటి గ్రామాలలో పంచాయతీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని పంచాయతీలను యాచించే స్థాయిలో పెట్టాయి. తమకు అనుకూలంగా ఉన్న కొంతమందికి మాత్రమే కాస్తోకూస్తో విదల్చడం తప్ప గ్రామాలను అభివృద్ధిపథంలోకి తీసుకువెళ్ళడం లేదని మండిపడ్డారు.
పట్టలేనంత ఆనందంగా ఉంది: పవన్ కళ్యాణ్, జనసేన సత్తా ఏంటో చాటారంటూ జనసేనాని
జనసేన విజయాలు అసామాన్యం..
గ్రామాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే మొదట మూడు విడతల్లో ఎలా అయితే యువత, ఆడపడుచులు బయటకు వచ్చి పోరాడారో... నాలుగో విడతలో కూడా అదే స్ఫూర్తిని చూపించాలి. శాసించే స్థాయిలో పంచాయతీలను నిలిపేందుకు జనసేన కృషి చేస్తుంది. మూడో విడతలో 2639 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. 23 శాతం ఓటింగ్ జనసేన సొంతమైంది. 270 కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కాయి. 1654 పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు రెండో స్థానంలో నిలబడ్డారు. ఈ గణాంకాలు సంతోషకరంగా ఉన్నాయి. ముఖ్యంగా కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులను ఎదుర్కొని జనసేన పార్టీ పంచాయతీలను కైవసం చేసుకోవడం అసామాన్య విషయం. మైసూరువారిపల్లి పంచాయతీ సర్పంచ్గా దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు భార్య సంయుక్త గెలుపొందడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు జనసేనాని.
కుప్పంలోనూ జనసేన గెలుపు.. బెరింపులకు పాల్పడ్డినా
కుప్పం నియోజకవర్గంలో పంచాయతీలు, వార్డులను జనసైనికులు గెలవడం మార్పునకు సంకేతం. పోరాటయాత్ర సమయంలో అరకు ఏజెన్సీ ప్రాంతమైన డుంబ్రిగూడ మండలంలో తిరిగాను. ఆంత్రాక్స్ వ్యాధి బారినపడ్డ వారిని కలిశాను. అక్కడ నీటి వసతులు లేక ప్రజలు పడుతున్న బాధలు చూశాను. అటువంటి ప్రాంతంలో జనసేన మద్దతుదారుడు పూజారి కొమ్ములు కొర్రమ్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలవడం సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చాలా గణనీయమైన సంఖ్యలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుగా జనసైనికుల గెలుపొందారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం ములగాంపల్లి పంచాయతీ నుంచి 24 ఏళ్ల యువకుడు సరియం రాజు జనసేన మద్దతుతో గెలిచారు. పెడన నియోజకవర్గం నీలిపూడి పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే హెచ్చరికలు చేశారు. వేరే పార్టీ నుంచి పోటీ చేసినా, తమ పార్టీకి ఓట్లు వేయకపోయినా ప్రభుత్వ పథకాలన్నీ తీసేస్తామని నేరుగా బెదిరించారు. అయినా ప్రజలందరూ కలసి జనసేన మద్దతుదార్లను గెలిపించారు. మొత్తం పంచాయతీని జనసేన క్లీన్ స్వీప్ చేయడం విప్లవానికి సంకేతం. నిశ్శబ్ధ విప్లవం తీసుకురావాలని 2008లో కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ ను స్థాపించాను. కులాలు, మతాలకు అతీతంగా ఆశయాలు, భావజాలం గల వ్యక్తులు బయటకు రావాలని ఆ రోజు దీన్ని ప్రారంభించాను. ఆ సంస్థ జనసేన పార్టీగా రూపుదిద్దుకుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే మార్పు వస్తుందనే నమ్మకం చాలా బలంగా ఏర్పడిందన్నారు పవన్ కళ్యాణ్.
మంచి చేయాలన్న తపనే గెలిపించింది..
నీలిపూడిలో సర్పంచ్ గా గెలుపొందిన పాశం కృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మచిలీపట్నం నియోజకవర్గం నేలకుర్రు పంచాయితీ సర్పంచ్ అభ్యర్ధి 17 ఓట్ల తేడాతో ప్రత్యర్ధిపై విజయం సాధించారు. అయితే రీకౌంటింగ్ పేరు చెప్పి రిజల్ట్ ఆపే ప్రయత్నం చేయగా పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు అంతా ఐక్యంగా పోరాటం చేయడం హర్షించదగ్గ విషయం. అవగనిడ్డ నియోజకవర్గం వేకనూరులో తుంగల శ్రీలక్ష్మి , పల్నాడులో తక్కెళ్లపాడు నుంచి శానం వెంకటేశ్వర్లు, రాయలసీమలోని కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో జనసేన గెలుపొందడం ఆనందదాయకం. పంచాయతీ ఎన్నికలు అంటే కాకలు తీరిన వ్యక్తులు, అనుభవంతో పడిపోయిన వ్యక్తులే ఉంటారని దశాబ్ధాలుగా పాతుకుపోయిన అభిప్రాయాన్ని కొత్తతరం యువత పూర్తిగా తుడిచేశారు. రాజాంపేట నియోజకవర్గంలోని వీరబల్లి, అవనిగడ్డ రామచంద్రపురం పంచాయతీల్లో వార్డు సభ్యులుగా గెలిచిన గుగ్గిళ్ల వెంకటేశ్ , సాయి భార్గవ్ నూనూగు మీసాల కుర్రాళ్లు. ప్రజలకు మంచి చేయాలన్న తపనే వారిని గెలుపొందేలా చేశాయని పవన్ వ్యాఖ్యానించారు.
మహిళలు, యువత పోరాట స్ఫూర్తి అభినందనీయం
పంచాయతీ ఎన్నికల్లో యువత, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేయడం హర్షించదగ్గ విషయం. ఈ స్ఫూర్తి అభినందనీయం. అధికార పార్టీ ప్రలోభాలకు ఎదురొడ్డి ఆడపడుచులు బయటకు వచ్చి పోటీ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మొదటి రెండు విడతల్లో గెలిపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులతో నిన్న ఫోన్ కాన్ఫురెన్స్ లో మాట్లాడాను. తూర్పుగోదావరి జిల్లా కోలంక పంచాయతీ సర్పంచ్గా గెలుపొందిన గుబ్బల మౌనికతో మాట్లాడితే.. 'నేను ఉండేది పూరిళ్లు. డబ్బు పంచే స్థోమత లేకపోయినా మార్పు రావాలనే సంకల్పంతో పోటీ చేయడానికి ముందుకు వచ్చాను. జనసైనికుల అండగా ఉండటంతో గెలుపొందాన'ని చెప్పారు. కృష్ణా జిల్లా అయిలూరు సర్పంచ్ గా విజయం సాధించిన పిరాటి సుజాత బి.ఈడీ. విద్యను అభ్యసించినవారు. ప్రభుత్వ విధివిధానాలతో విసుగు చెంది మార్పు రావాలనే లక్ష్యంతో వచ్చానని, గ్రామంలోని మహిళలు వ్యవసాయ పనులను. పాడిని పక్కన పెట్టి వెన్నంటి వుండి ప్రచారం చేసారని చెప్పారు. 'మా లంక గ్రామాల్లో పంట తీసుకువెళ్లే వాహనాలు దిగబడిపోతే క్రేన్ తెప్పించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులు మారాలనే రాజకీయాల్లోకి వచ్చాను' అని చెప్పారు. పంచాయతీ నిధులు దేనికైతే ఖర్చు చేయాలో దానికి ఖర్చు చేయకుండా ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఇవన్ని చూసి రాజకీయాలు అంటే ఆస్తకి లేని యువత, ఆడపడుచులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోటీ చేయడం మార్పుకు సంకేతం. ఇదే పోరాట స్ఫూర్తిని నాలుగో దశ ఎన్నికల్లో చూపి పంచాయతీల్లో జనసేన మద్దతుదారులను గెలిపించాలి. అప్పుడే పంచాయతీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదుగుతాయి. ఆ దిశగా జనసేన పార్టీ పని చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.