తెలుగు ప్రముఖులకు ‘పద్మ’ అవార్డులపై స్పందించిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్/అమరావతి: పద్మ పురస్కారాల ఎంపిక ప్రతిభకు పట్టంకట్టేలా జరిగిందని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను 'పద్మవిభూషణ్' పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహమని అన్నారు.
ఎస్పీ బాలు, చిత్రకు పద్మ పురస్కారాలు సంతోషకరం
చలనచిత్ర సంగీత రంగంపై ఎస్పీ బాలు ముద్ర చెరగనిది. మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపిక చేయటం ఆయన కీర్తిని మరింత పెంచింది. ప్రఖ్యాత గాయని కెఎస్ చిత్రకు 'పద్మభూషణ్' పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరం. నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది భాషలతోపాటు పలు భాషల్లో తన గళంతో శ్రోతలను మైమరపించారని కొనియాడారు పవన్ కళ్యాణ్.
ప్రతిభకు దక్కిన పద్మ పురస్కారాలు
ప్రముఖ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవలకు 'పద్మశ్రీ' గౌరవం దక్కింది. మృదంగ విద్వాంసులంటే పురుషులే అనుకొన్న సమయంలో తొలి మహిళ మృదంగ విద్వాంసురాలిగా కచేరీలు చేసిన సుమతి ప్రతిభకు సరైన గుర్తింపు 'పద్మశ్రీ' పురస్కారంతో దక్కింది. మన మాతృభాష తెలుగుకు విశేషమైన సేవలు అందించి, అవధాన విద్యలో దిట్టగా నిలిచిన ఆశావాది ప్రకాశరావుని 'పద్మశ్రీ' వరించడం మన తెలుగు అవధానానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
కళలకు జీవం పోసేల పద్మ అవార్డుల ఎంపిక..
ఆదివాసీల సంస్కృతిసంప్రదాయాలను కాపాడుతున్న గుస్సాడీ నృత్యప్రవీణుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కనకరాజును పద్మశ్రీకి ఎంపిక చేయడం కళలకు మరింత జీవంపోసింది. ప్రతిభావంతులకు పట్టంగట్టే విధంగా పద్మ పురస్కారాల ఎంపిక సాగింది. వీరందరికీ నా తరఫున, జనసేన పక్షాన శుభాభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
బీజేపీ-జనసేన నేతల భేటీ.. జనసేన కార్యాలయానికి సోము వీర్రాజు
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు మంగళ వారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన సోము వీర్రాజును మనోహర్ సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ నాయకులను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. తిరుపతి ఉపఎన్నిక, పంచాయతీ ఎన్నికలపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది.
Recommended Video