‘బీజేపీ, వైసీపీ పొత్తు’పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు, జగన్పై విమర్శలు, రాపాకకు చురకలు
అమరావతి: రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులకు తాము అండగా ఉంటామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని పలు గ్రామాల్లో నిరసనలు చేపడుతున్న రైతులను శనివారం కలిసిన ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు తమ సమస్యలను చెప్పుకున్నారు.
జగన్.. ఎన్నికల ముందే ఎందుకు చెప్పలేదు?
అధికార వికేంద్రీకరణపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని పవన్ కళ్యాణ్ నిలదీశారు. పదవిలో లేకుంటే ఒకలా.. ఉంటే మరోలా మాట్లాడతారా? అని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. రాజధాని ఉద్యమంలో రైతులకు అండగా తాను పోరాటం చేస్తానని, బీజేపీ కూడా ఇందుకు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
అమరావతే రాజధాని..
రాయలసీమ, ఉత్తరాంధ్ర వైపు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు అమరావతి రైతులు కన్నీళ్లపై రాజధాని వస్తే మాకేం ఆనందం ఉంటుందని అంటున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజధానిగా అమరావతి ఉంటుందని, ఇందుకు తాను చివరి వరకు పోరాటం చేస్తానని అన్నారు. కాగా, సీఎం జగన్మోహన్ రెడ్డిని రైతులు కలిశారా? అని ప్రశ్నించగా.. కొందరు డ్రైవర్లు, ఇతరులను తీసుకెళ్లి రైతులుగా చెప్పుకున్నారని.. పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు రైతులు.
రాపాక ఉన్నారో లేదో తెలియదు..
తనకు అధికారం లేదని, గెలిచిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో.. లేదో తెలియదని.. రాపాక వరప్రసాద్పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను ఓట్ల కోసం రాలేదని.. ప్రజలకు అండగా ఉండాలనే వచ్చానని చెప్పారు. రైతులపై జరిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తాను ప్రతిరోజూ వార్తల్లో కనిపించే వ్యక్తిని కాదని.. పత్రికల్లో కనిపించడం కోసం లేని వార్తలను సృష్టించను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఉన్న సమస్యను బలంగా వినిపిస్తానని అన్నారు. రాజకీయ క్రీడలో పోలీసులు భాగం కాకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
అమరావతికి కట్టుబడే బీజేపీ.. జగన్ ఏ రాజధానికి నిధులు అడిగారో..
రాజధాని తరలింపును రియల్ ఎస్టేట్ క్రీడలా మార్చారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. మూడు రాజధానులు సమ్మతం కాదని కేంద్ర చెప్పారని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకొనేటప్పుడే దీనిపై స్పష్టత తీసుకున్నానని అన్నారు. అయితే, కొన్ని పరిమితుల కారణంగా కేంద్రం రాజధాని విషయంలో జోక్యం చేసుకోదని అన్నారు. జనసేన, బీజేపీ అమరావతికి కట్టుబడి ఉన్నాయన్నారు. రాజధానికి నిధులు అడిగామని సీఎం జగన్ అంటున్నారని.. అయితే, ఆయన ఏ రాజధానికి నిధులు అడిగారో సమాధానం చెప్పాలని నిలదీశారు.
రాజధాని మార్చినా... బాబు, జగన్లదే బాధ్యత..
ఒకవేళ రాజధాని మార్చినా మళ్లీ అమరావతికే తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని తరలింపు వివాదానికి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలదే బాధ్యత అని వ్యాఖ్యానించారు. రాజధాని భూములను ఇళ్ల స్థలాలకు ఇస్తామనడం సరికాదన్నారు. రాజధాని రైతులు తమ భూములను జగన్ నవరత్నాల కోసం ఇవ్వలేదని, అమరావతిని కదిలించే శక్తి జగన్కు లేదన్నారు. రాజధాని అమరావతికి బీజేపీ, జనసేన కట్టుబడి ఉన్నాయని, రాజధాని అమరావతిగా ఉంటుందని ఒప్పందం రాసుకున్నామని అన్నారు. ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత రాజధాని తరలింపు సరికాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటున్న వైసీపీ సర్కారు అభివృద్ధి చెందిన విశాఖలోనే రాజధాని ఎందుకు పెడుతోందని.. శ్రీకాకుళంలో పెట్టవచ్చు కదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖపట్నంలో మళ్లీ భూములు ఎందుకు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
బీజేపీ, వైసీపీ పొత్తుపై..
పొత్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనని అన్నారు. బీజేపీ.. వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందని తాను అనుకోనని అన్నారు. ఒక వేళ బీజేపీ.. వైసీపీతో పెట్టుకుంటే తాను బీజేపీతో కలిసి నడవనని, తప్పుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే, బీజేపీ అలాంటి పని చేస్తుందని భావించడం లేదని అన్నారు. కాగా, బీజేపీ, వైసీపీ పొత్తు అని, కేంద్రంలో వైసీపీకి మంత్రి పదవులు కూడా దక్కుతాయంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అటు బీజేపీ, ఇటు వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీల మధ్య పొత్తు లేదని స్పష్టం చేస్తున్నారు.