కలిశారు, విలీనం చేయమన్నారు: అమిత్ షాకు పవన్ కల్యాణ్ రిప్లై
నెల్లూరు: బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రస్తావన కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెచ్చారు. నెల్లూరులో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన అమిత్ షా ప్రస్తావన చేశారు. ఆయన ఏం చెప్పారో కూడా వెల్లడించారు.
అమిత్ షాకు తాను చెప్పిన విషయాన్ని కూడా వెల్లడించారు. తాను బిజెపిలో జనసేనను విలీనం చేయడానికి నిరాకరించిన విషయాన్ని వెల్లడించారు. బిజెపిపై ఆయన పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదాపై కూడా మాట్లాడారు.
అమిత్ షా కలిసి విలీనం చేయమన్నారు...
బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తనను కలిశారని, భవిష్యత్తు అంతా జాతీయ పార్టీలదే అని చెప్పారని, అందువల్ల జనసేనను బిజెపిలో విలీనం చేయాలని అడిగారని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను అందుకు నిరాకరించినట్లు ఆయన తెలిపారు. జాతీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.
మోడీపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, మాట తప్పిన ప్రధాని మోడీపైనా, బీజేపీ కేంద్ర ప్రభుత్వంపైనా పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. 'మోడీ డౌన్ డౌన్... పీఎం డౌన్ డౌన్' అంటూ ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. వెంటనే జోక్యం చేసుకుని- "డౌన్ డౌన్ అని నేను చెప్పానా? ఎవరినీ తక్కువ చేయవద్దు" అని పవన్ కల్యాణ్ సూచించారు. అది చాలా తప్పు అని అన్నారు.
జగన్ పార్టీకీ అంతే బాధ్యత
ప్రత్యేక హోదా కోసం అధికార తెలుగుదేశం ఎంత బాధ్యత వహించాలో, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా అంతే బాధ్యతను స్వీకరించాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా అంతే బాధ్యత ఉందని అన్నారు.
అప్పుడే రాజకీయాల్లోకి రావాలనుకున్నా.
ఇంటర్ చదువుతున్నప్పుడే రాజకీయాల్లో రావాలనుకున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. క్రమశిక్షణ, జవాబుదారీతనం, బాధ్యతతోనే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. రాజకీయాలంటే ప్రజల్లో భయం పోవాలని, భావితరాల భవిష్యత్ బాగుండాలనే ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పారు.
సిఎం అంటూ నినాదాలు...
పవన్ కల్యాణ్ను ఉద్దేశించి కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ నినాదాలపై పవన్ కల్యాణ్ స్పందించారు."మీరు సీఎం అంటే నేను అవను, నేను పొంగిపోను. సీఎం కావడానికి చాలా అనుభవం కావాలి" అని అన్నారు.