జగన్లా చెప్పడంకాదు, టీడీపీ నేతలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే: పవన్ కళ్యాణ్
కర్నూలు: ప్రధాని మోడీ మార్చి 1న విశాఖకు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని, మన మీద సీబీఐ, ఐటీ దాడులు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. దీనిపై కర్నూలు పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఐటీ దాడులు జరుగుతోంది మన మీద (ఏపీ ప్రజలు) కాదని, మీ పార్టీ అవినీతి నాయకులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.
రాష్ట్రానికి జరిగిన నమ్మకద్రోహంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత ఉందో అంతకు పదింతలు మీ(చంద్రబాబు, టీడీపీ) పాత్ర ఉందని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవద్దని, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కారణం మీ అసమర్థత, నిర్లక్ష్యమని చంద్రబాబుపై మండిపడ్డారు.
రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇంకా వెనుకబడిపోయిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అని, తాను రాయలసీమలో పుట్టకపోయినా సరే రాయలసీమ అభివృద్ధి కోసం చివరివరకు పని చేస్తానని ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. నిన్న గుంటూరులో మన ప్రచార రథాలపై రాళ్లు వేసి, మన మహిళల్ని గాయపరిచారని, తమ జనసైనికుల మీద గాని, ఆడపడుచుల మీద గాని దాడులు చేసినా అక్రమ కేసులు పెట్టినా సరే చూస్తూ కూర్చోనని హెచ్చరించారు.
ఒక వ్యక్తికి పాలన అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని, రాబోయే రోజుల్లో అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయని, అన్ని వర్గాలకు న్యాయం జరగాల్సిందేనని చెప్పారు. లక్షలాది మంది జనం మార్పు కోసం చూస్తున్నారని, కానీ నేను జగన్లా ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబులా మళ్ళీ నేనే, తర్వాత మా అబ్బాయి ముఖ్యమంత్రి అని అనడం లేదని, మీ అందరి జీవితాలు మారాలని కోరుకుంటున్నానని చెప్పారు.
నేను మీ జీవితాలు మార్చడానికి వచ్చానని, మీరు సీఎం పదవి ఇస్తారా లేక ప్రతిపక్షంలో కూర్చుంటారా మీ (ప్రజలు) ఇష్టమని, కానీ జీవితాల్లో మార్పు తీసుకు వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. మార్పు పెద్దల వల్ల రాదని, ముప్పై ఏళ్ల యువత తీసుకు వస్తే వస్తుందన్నారు. మీకు సీఎం పదవి ఇస్తే బాగా పాలిస్తానని, లేకపోతే జనసైనికుడిలా పోరాడుతానని చెప్పారు. కర్నూల్ నుంచి వేల కోట్ల ఆస్తులు, వందల కోట్ల కాంట్రాక్టులు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని, కానీ యువతకు ఉపాధి అవకాశాలు లేవని, అలాంటి వ్యవస్థను మార్చాలన్నారు.