పవన్ రూటు మారింది...మన ఎంపీలు ఢిల్లీని గడగడలాడించారు:సిఎం చంద్రబాబు
విజయవాడ:పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూటే మార్చేశాడని, మనల్నే విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధినేత పై మండిపడ్డారు.ప్రతిపక్ష నేత జగన్, పవన్కల్యాణ్ను పక్కన పెట్టుకుని, కేంద్రం ఏపీకి నమ్మకద్రోహం, అన్యాయం చేసిందని చంద్రబాబు ఆరోపించారు.
సిఎం చంద్రబాబు శుక్రవారం కృష్ణాజిల్లాలో పర్యటించారు. ముందుగా విస్సన్నపేట మండలం తాతకుంట్లలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీకి రూ. 75వేల కోట్లు రావాలని, ఫ్యాక్ట్ఫైండింగ్ కమిటీ చెబితే పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మాట తప్పింది...మడమ తిప్పింది కేంద్రమేనంటూ ధ్వజమెత్తారు. ప్రజల ముందు ఎన్డీఏ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టామని చంద్రబాబు చెప్పారు.
పార్లమెంట్లో మన ఎంపీలు గొప్పగా పోరాడారని, మన ఎంపీలు ఢిల్లీని గడగడలాడించారని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. టిడిపి ప్రభుత్వం చేపట్టిన గ్రామదర్శినిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందని, అసలు ఏపీకి రాజధానే లేదని, ఆదాయం కూడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, కాలేజీలు లేవని, ఆదాయం వచ్చే మార్గం లేదన్నారు.
అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకెళ్లాలని ఆనాడే నిర్ణయించుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గడచిన నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. ప్రజలు ఈ అభివృద్ది గురించి ఆలోచించాలని చెప్పారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చంద్రబాబు మండిపడ్డారు.
బహిరంగ సభలో కేంద్రం అన్యాయం గురించి వివరిస్తూ...''రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది. రాష్ట్ర సమస్యలపై 29సార్లు ఢిల్లీ వెళ్లాను. పెడచెవిన పెట్టడంతో అనుమానం వచ్చింది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చాం. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాం. ప్రధాని మోదీని పార్లమెంటులో నిలదీసిన వ్యక్తి కేశినేని నాని...కుట్ర రాజకీయాలతో మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. హక్కులు సాధించే వరకు రాజీపడేది లేదు" అని చంద్రబాబు చెప్పారు.
వైసీపీకి సిద్ధాంతం చేదన్నారు. ఆ పార్టీ ఒక సభ్యత లేని పార్టీ అని...అవీనీతి కేసుల్లో కూరుకుపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కేసుల మాఫీ కోసం పుట్టిన పార్టీ వైసీపీ. జగన్వి పద్దతిలేని, పసలేని విమర్శలు...ఒక్కోసారి ఆయన విమర్శల వల్ల బాధేసినా ప్రజల కోసం భరిస్తున్నా...మాట తప్పింది. మడమ తిప్పింది కేంద్రమే నని చంద్రబాబు ధ్వజమెత్తారు.