లోకేశ్ను నేను కలవలేదు, సెంటిమెంట్తోనే పవన్ నా పేరు చెప్పి ఉంటారు:శేఖర్ రెడ్డి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై నోట్ల మార్పిడి కేసులో నిందితుడైన తమిళనాడు మైనింగ్ వ్యాపారి శేఖర్రెడ్డి స్పందించారు. పవన్ తన గురించి చెప్పినవన్నీ అబద్దాలేనని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ను తన జీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదని, అసలు లోకేష్ ను చూడనే లేదని శేఖర్ రెడ్డి చెప్పారు. తనతో లోకేశ్కు సంబంధాలున్నాయని, దానికి సంబంధించి ప్రధాని మోదీ వద్ద సమాచారం ఉందని, అందుకే చంద్రబాబు భయపడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని శేఖర్ రెడ్డి తెలిపారు.
అలాగే పవన్ కళ్యాణ్ ను కూడా తాను టీవీల్లో, సినిమాల్లో చూడడమే తప్ప నిజజీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా రెండుసార్లు మాత్రమే కలుసుకున్నానని శేఖర్ రెడ్డి చెప్పారు. తనను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించిన సందర్భంలో తిరుమల కొండ మీద పద్మావతి గెస్ట్ హౌస్లో మిగతా సభ్యులతో పాటు సీఎంను కలిసి ఫొటో తీసుకున్నామని తెలిపారు. మరో సందర్భంలో సిఎం చంద్రబాబు తిరుపతి వచ్చినప్పుడు ఆయనకు ప్రసాదం ఇచ్చేందుకు వెళ్లానని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబును ఇంకెప్పుడూ కలుసుకోలేదన్నారు. తమిళనాడులో ఉన్న వారికి ఆంధ్రా రాజకీయ నాయకులతో సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. అసలు ఆంధ్రప్రదేశ్లో తనకు వ్యాపారాలు గానీ, కాంట్రాక్టులు గానీ లేవన్నారు.
తనకు 500 లారీలు, 700 పొక్లెయిన్లు ఉన్నాయని...ఏడాదికి తన ఆదాయం వంద కోట్ల రూపాయల పైమాటేనని శేఖర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన దగ్గరే చాలా డబ్బుంటుందని, తానే ఇతరులకు సహాయం చేస్తానని, అలాంటిది ఇతరుల డబ్బు తన వద్ద ఎందుకు ఉంచుకుంటానని శేఖర్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీలో సభ్యుడిగా కూడా తనను తమిళనాడు కోటా నుంచే నియమించారని, తన పేరును ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత సిఫారసు చేశారని శేఖర్రెడ్డి తెలిపారు. తన ఇంటిపై సీబీఐ దాడులు జరిపిన కేసు గురించి మాట్లాడుతూ...ఇప్పటివరకూ సిబిఐ అధికారులకు నోట్ల మార్పిడి కేసులో చిన్నపాటి సాక్ష్యం కూడా దొరకలేదని, అందుకే తనపై ఎలాంటి నేరారోపణలు చేయలేకపోతున్నారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ తనపై ఆరోపణలు చేయడానికి కారణం ఏమైవుంటుదన్న ప్రశ్నకు సమాధానంగా...తమిళనాడులో ఎన్నికలకు పోటీ చేసే కొందరు రాజకీయ నాయకులు తనను పిలుస్తారని...అందుకు కారణం తాను వస్తే వారికి మంచి జరుగుతుందనే నమ్మకమని...బహుశా పవన్ కళ్యాణ్ కు కూడా ఈ విషయం ఎవరో చెప్పి ఉంటారని...తన పేరు ఉచ్చరిస్తే సెంటిమెంటుగా జనసేన కూడా గెలుస్తుందని పవన్ ఈ విధంగా తన గురించి మాట్లాడివుంటారని శేఖర్ రెడ్డి ఎద్దేవాచేశారు.