జనసేన మేనిఫెస్టో...జనాలందరికీ చేరాలి: పార్టీ కమిటీకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
Recommended Video
హైదరాబాద్:జనసేన మేనిఫెస్టోలోని అంశాలకు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(ప్యాక్)ని ఆదేశించారు.
12 అంశాలతో కూడిన జనసేన విజన్ డాక్యుమెంట్ ఇప్పటికే ప్రజల మన్ననలను పొందుతోందని పవన్ కళ్యాణ్ సంతృప్తి వెలిబుచ్చారు. అయితే మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ను అన్నివర్గాల ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలనేద తన ఉద్దేశ్యమన్నారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్యాక్ కు సూచించారు. మేనిఫెస్టోపై సెప్టెంబరు 12 నుంచి స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించి ఎన్నికల వరకు ప్రచారాన్ని కొనసాగించాలని పవన్ చెప్పారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు బుధవారం హైదరాబాద్ మాదాపూర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(ప్యాక్) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మేనేఫెస్టో ప్రచారం గురించి వారికి దిశానిర్ధేశం చేశారు. జనసేన ఉచిత గ్యాస్ సిలెండర్, రేషన్కు బదులు నగదు, మహిళలకు 33శాతం రిజర్వేషన్లపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని, ఇవి ప్రతి ఒక్కరికీ తెలియాల్సి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ సూచనల అనంతరం ప్యాక్ మరోసారి ఈ విషయమై కూలంకషంగా చర్చించింది. ప్రచార వ్యూహాలపై సమాలోచనలు జరిపింది. ప్రధాన కమిటీ వ్యూహాలతో పాటు జిల్లా కమిటీలతో చర్చించాక కార్యాచరణ ప్రణాళిక రూపొందించ నున్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్యాక్ కన్వీనర్ మాదాసు గంగాధరం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ విధంగా రూపొందించిన ప్రణాళికను పార్టీ అధ్యక్షుడు పవన్కు సమర్పిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
ఆగష్టు 14 వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తమ పార్టీ ప్రాథమిక మేనిస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందుగా భీమవరంలోని మావుళ్లమ అమ్మవారిని దర్శించుకున్న పవన్ అనంతరం జనసేన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల వ్యవధి ఉండగానే పవన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. అయితే, ఎన్నికల సమయంలో తుది మేనిఫెస్టోను మరోసారి విడుదల చేస్తామని పవన్ ఆ సందర్భంలో తెలిపారు. ఇందులో 7 సిద్ధాంతాలు, 12 హామీలను జనసేన పార్టీ పొందుపర్చింది.