పవన్ కల్యాణ్ వ్యవహారం కామెడీ ఎపిసోడ్ లాంటిది; మహేష్ ను వద్దంటా:ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శలు గుప్పించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేషగిరిరావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం గురించే కాకుండా పలు సమకాలీన అంశాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నకు వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు స్పందించిన తీరు సంచలనం సృష్టిస్తోంది. అలాగే టాప్ హీరో మహేష్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న ప్రశ్నకు కూడా శేషగిరిరావు ఇచ్చిన సమాధానం కలకలం రేపుతోంది. సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సేన ఎప్పుడూ టిడిపికి వ్యతిరేకమేనని చెప్పుకొచ్చారు వైసిపి నేత ఘట్టమనేని శేషగిరిరావు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధాన అంశాల్లో కొన్ని...
పవన్ కళ్యాణ్ ది...కామెడీ ఎపిసోడ్
"పవన్ కల్యాణ్ గారు చేసే వ్యాఖ్యలకు అర్థం ఉండదు. తోలుబొమ్మలాటలో కేతిగాడు వచ్చినట్టుగా మధ్యమధ్యలో వచ్చి ఆయనేదో మాట్లాడి వెళుతుంటారు. పవన్ కల్యాణ్ ది కామెడీ ఎపిసోడ్ లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీట నొక్కితే అప్పుడు వచ్చి మాట్లాడి వెళిపోతుంటారు. ఏపీలో పలు సమస్యలు ఉంటే ఎప్పుడైనా సరైన సమయంలో పవన్ కల్యాణ్ స్పందించారా? టీడీపీ ఏం కావాలంటే ‘జనసేన' అది మాట్లాడుతోంది"..అని ఘట్టమనేని శేషగిరిరావు చెప్పుకొచ్చారు.
మహేష్ మద్దతు ఎవరికి...వద్దని చెప్పొస్తా...
నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీకి..."కృష్ణ - మహేశ్ సేన"..ఇటీవల మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ప్రస్తావించి ఈసారి ఎన్నికల్లో మహేష్ బాబు మద్దతు ఎవరికి ఉంటుందని ప్రశ్నించగా, వైసీపీకి "కృష్ణ - మహేశ్ సేన" ఫ్యాన్స్ మద్దతివ్వడమంటే, ఆ పార్టీకి మహేశ్ బాబు మద్దతు ఇచ్చినట్టు కాదు. మహేశ్ బాబు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లకూడదు. మహేశ్ అందరికీ కావాల్సిన వ్యక్తి.. హీ ఈజ్ ఏ స్టార్. అందరికీ మహేశ్ కావాలి..మహేశ్ కు అందరూ కావాలి. ఒకవేళ, ఏ రాజకీయపార్టీకైనా మహేశ్ బాబు మద్దతిస్తానంటే... ‘వద్దురా' అని నేనే చెప్పొస్తా' అని ఘట్టమనేని శేషగిరిరావు చెప్పారు.
కృష్ణ కంటి రక్తపు బిందువు..."కృష్ణ సేన"
ఇక కృష్ణసేన విషయమై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సూపర్ స్టార్ కృష్ణ కంటి రక్తపు బిందువు నుంచి "కృష్ణ సేన" అనే సంస్థ 1984లో పుట్టిందని అన్నారు. 1984లో రాయలసీమలో ఎన్నికల ప్రచారానికి కృష్ణ వెళ్లారు...కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడి వస్తున్నారు. ఆ సమయంలో టీడీపీ పార్టీ కార్యాలయం మేడపై నుంచి రాళ్లు వేయడంతో కృష్ణ కంటికి దెబ్బతగిలి రక్తం వచ్చింది. వెంటనే, కర్నూలు ఆసుపత్రిలో దెబ్బ తగిలిన కంటికి ఆపరేషన్ చేయించుకుని, హైదరాబాద్ వచ్చారు. ఈ సంఘటనను తెలుగుదేశం పార్టీ వాళ్లు అధికారికంగా ఇంతవరకూ ఎవరూ ఖండించలేదు. మేడపై ఉన్న టీడీపీ ఆఫీసు నుంచి వచ్చి రాళ్లు పడ్డాయి. దుండగులెవరూ ఈ రాళ్లు విసరలేదు. ఈ సంఘటన నేపథ్యంలో పుట్టిందే..."కృష్ణ సేన"...అని వివరించారు.
Recommended Video
"కృష్ణ సేన"...ఎప్పుడూ టిడిపికి వ్యతిరేకమే...
కృష్ణ కు రక్షణగా మొదలైన సేన.."కృష్ణ సేన". ఈ సేన ఎప్పుడూ టీడీపీకి వ్యతిరేకమే. ఇందులో దాదాపు మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారు. మహేశ్ బాబు ఎదిగే క్రమంలో అతనికి కూడా ఈ సేన మద్దతు ఇస్తూ "కృష్ణ - మహేశ్ సేన"గా మారింది. దీనికి ఆనాటి నుంచి నేను గౌరవాధ్యక్షుడిని. "కృష్ణ - మహేశ్ సేన" ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. కాంగ్రెస్ పార్టీకి ఈ సేన మద్దతుగా ఉండేది. మొన్నీ మధ్య వైసీపీకి మద్దతు ఇచ్చింది...అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఎప్పుడూ నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఘట్టమనేని శేషగిరిరావు మరోసారి తాజా వ్యాఖ్యలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.