మున్సిపల్ ఎన్నికల బరిలోకి జనసేన: పవన్ కల్యాణ్ సంకేతాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన సిద్దమవుతున్నట్లు అనిపిస్తోంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ శనివారంనాడు సంకేతాలు ఇచ్చారు. స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి వస్తోందని, త్వరలోనే జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఆందోళనలు చంద్రబాబుకు తెలిసి ఉండదని, తెలిసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని అన్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పారు. పారిశ్రామీకరణకు తాను వ్యతిరేకం కాదని, రైతులకు న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన చెప్పారు.
రెండున్నరేళ్లుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావడంలేదని జనసేన ఆయన అన్నారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులుతో కలిసి ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. గోదావరి ప్రాంతంలో పరిశ్రమల వల్ల నీరు కలుషితమవుతుందన్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లోని అన్నిస్థానాలను టీడీపీ గెలుచుకుందని, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. సాగుకు అనుకూలం లేని చోట పరిశ్రమలు పెట్టాలని జనసేన నేత పవన్కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు.
మత్స్యకారులకు నష్టం జరిగితే కుల సమస్యగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యలు చెప్పుకునే అవకాశం బాధితులకు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ఇంత గొడవ జరుతున్నా నేతలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
మెగా ఫుడ్ ఫ్యాక్టరీని సముద్ర తీరప్రాంతానికి తరలించాలని ఆయన సూచించారు. కమిటీ ఏర్పాటు చేసి లోతైన అధ్యయనం జరపాలని డిమాండ్ చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడించాలని పవన్ పిలుపునిచ్చారు.