ఉండవల్లి ఎఫెక్ట్, చంద్రబాబుకు 'ఆ' షాక్: పవన్ కళ్యాణ్ లేకున్నా.. టీడీపీ తీవ్ర అగ్రహం
అమరావతి: కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలుగుదేశం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏపీ బీజేపీ, టీడీపీ నేతలు లెక్కలతో తేల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీ అధిష్టానం మనసులో ఏమున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం పొత్తు తెగుతుందా అన్న విధంగా ఉంది.
చదవండి: చెప్పలేదు: పవన్ కళ్యాణ్తో ఉండవల్లి భేటీ, బాబు-మోడీ గొడవ తెంచుతారా?
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. కేంద్రం, ఏపీ చెబుతున్న లెక్కలను తెల్చేందుకు ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ వంటి వారితో కలిసి ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. పవన్ ఈ ప్రయత్నం టీడీపీని ఇరుకున పెట్టేలా ఉందనే ప్రచారం సాగుతోంది.
చదవండి: పవన్ అడిగితేనే బాబు ఇవ్వలేదు, కేంద్ర-రాష్ట్రాలు అబద్దం చెప్పలేదు: ఉండవల్లి ట్విస్ట్
బీజేపీ-టీడీపీ కొట్లాట, రంగంలోకి పవన్ కళ్యాణ్
నవ్యాంధ్ర ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన నిధులను 2022 వరకు ఇచ్చేందుకు గడువు ఉంది, అయినాప్పటికీ కేంద్రం అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు, జాతీయ సంస్థలకు.. ఇలా ఎన్నో నిధులు ఇచ్చిందని ఏపీ బీజేపీ నేతలు లెక్కలు చెప్పారు. ఈ లెక్కలను టీడీపీ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నారు.
ఉండవల్లి ఉండటంపై టీడీపీ ఆందోళన
వేదిక ఏర్పాటు విషయాన్ని పక్కన పెడితే.. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండటంపై టీడీపీ ఆందోళన చెందుతోందని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉండవల్లి.. చంద్రబాబుపై కేసులు వేసి, ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం చేశారు.
ఉండవల్లితో చర్చలు ఏమిటి
ఇప్పుడు అదే ఉండవల్లిని జేఏసీలోకి తీసుకుంటానని పవన్ చెప్పడం టీడీపీకి రుచించలేదని తెలుస్తోంది. పవన్ గతంలో టీడీపీకి మద్దతిచ్చారని, అలాంటి వ్యక్తి ఉండవల్లితో చర్చలు జరపడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నామని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారని తెలుస్తోంది.
ఉండవల్లి వంటి వారితో కలిస్తే ఆమోదించలేం
వచ్చే ఎన్నికల్లోను తాము పవన్తో కలిసి వెళ్లాలని భావిస్తున్నామని, అతడు కోరుకున్న సీట్లు కూడా దాదాపు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్్నామని, ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని బాగా వ్యతిరేకించే ఉండవల్లి వంటి వారితో జేఏసీ అంటూ తెరపైకి రావడం మాత్రం సరికాదని టీడీపీ నేతలు ముచ్చటించుకుంటున్నారని అంటున్నారు. ఉండవల్లి వంటి వారితో పవన్ ముందుకు సాగితే తాము దానిని ఆమోదించలేమని అంటున్నారట.
పవన్ మద్దతు లేకున్నా నష్టం లేదు
ఒకవేళ 2019లో పవన్ కళ్యాణ్ తమతో జతకట్టకపోయినా తమకు పెద్దగా వచ్చే నష్టమేమీ లేదని టీడీపీ నేతలు అంటున్నారట. జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీ చేస్తే కొన్ని సీట్లలో మాత్రమే ఆయన ప్రభావం ఉంటుందని, గెలుపు మాత్రం టీడీపీదేనని వారు చెబుతున్నారట.
పవన్ అసలు టార్గెట్ బీజేపీనే
అయితే, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీనే టార్గెట్ చేసుకున్నారని, ఆయన చర్యలు మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని ఇబ్బందులకు గురి చేసేందుకే ఆయన జేపీ, ఉండవల్లి వంటి వారితో వేదికను తెరపైకి తెచ్చారనే వారూ లేకపోలేదు.