10 జిల్లాల్లో 40 రోజులు: పవన్ కళ్యాణ్ యాత్రకు లగ్జరీ బస్సు సిద్ధం, ఎన్నో సదుపాయాలు
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందుకోసం జనసేన పార్టీ ఓ బస్సును కొనుగోలు చేసింది. ఇందులో అన్ని వసతులు ఉండనున్నాయి.
చదవండి: 'ఇలా మాట్లాడుతున్నారేంటి... పవన్ వ్యాఖ్యలతో జనసేన సభకు వెళ్లిన వాళ్లూ విస్మయం'
బస్సులో అన్ని సదుపాయాలతో పాటు అత్యవసరంగా నేతలతో సమావేశం కావడానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఓ గదిని కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు అటు ఇటుగా మరో ఏడాది మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ తమ దారుల్లో ప్రజల్లోకి వెళ్తున్నాయి. చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం అంటూ సభలు నిర్వహిస్తున్నారు. జగన్ పాదయాత్ర కొనసాగుతోంది.
మరోవైపు, వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ కూడా బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. 40 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. పది జిల్లాలను కవర్ చేస్తారు.
ఇందుకోసం, ప్రత్యేకంగా లగ్జరీ బస్సును సిద్ధం చేస్తున్నారు. ఈ బస్సులో విశ్రాంతి గది, సమావేశపు గది, ల్యాప్టాప్, ఇంటర్నెట్ సౌకర్యం, యాత్ర సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు బస్సు పైకి వెళ్లేందుకు నిచ్చెన వంటి ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటాయి.