వాళ్లకి పవన్ మాస్టర్ స్ట్రోక్!: ఛానల్ కొన్న తోట ఎవరు? ఇక చిరంజీవి - నిమ్మగడ్డ కూడా??
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ టీవీ ఛానల్ ఉండాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల రెండు టీవీ ఛానల్స్ సొంం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన కొత్త ఛానల్ పెడతారని, ఇతర ఛానల్స్ తీసుకుంటారని గతంలో ప్రచారం జరిగింది.
రెండోది నిజమైంది. 99 ఛానల్ను జనసేన నేత తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారని అంటున్నారు. ఇతను మాజీ ఐఏఎస్ అధికారి. ప్రజారాజ్యం పార్టీ తరఫున పార్టీ నుంచి పోటీ చేసేందుకు తన పదవికి రాజీనామా చేసి రాజకీయాలలోకి వచ్చారు. దీంతో లెఫ్ట్ పార్టీలకు అనుబంధంగా ఉన్న 99 ఛానల్ను చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. నెగిటివ్ ప్రచారం లేదా లైవ్ కవరేజ్కు దూరంగా ఉన్న పార్టీలు లేదా ఛానల్స్కు పవన్ ఇలా షాకిచ్చారు.
టీవీ ఛానల్ కొనడానికి బలమైన కారణాలు, నెగిటివ్ పబ్లిసిటీ
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన పవన్కు అనుకూలంగా ఒక్క టీవీ ఛానల్ కూడా లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ కొనుగోలు చేయాలని పవన్ భావించారు. ఇందులో భాగంగా చంద్రశేఖర్ 99 ఛానల్ను తీసుకున్నారు. పవన్ లైవ్ కవరేజ్ ఇవ్వడం పక్కన పెడితే, కొన్ని ఛానల్స్ ఆయనకు నెగిటివ్ పబ్లిసిటీ ఇస్తున్న నేపథ్యంలో టీవీ ఛానల్ ఉండాలన్న పవన్ కోరిక మరింత బలపడిందని, ఆ కోరిక నెరవేరిందని అంటున్నారు.
నెగిటివ్ పబ్లిసిటీకి కౌంటర్
ఇతర ఛానళ్లలో జనసేనాని లైవ్ కవరేజ్ విషయం పక్కన పెడితే, ఆయనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి సొంత ఛానల్స్ ద్వారా కౌంటర్ ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇది ఎంతో కీలకమని భావిస్తున్నారు.
ఇక నుంచి జనసేన వాయిస్
పవన్ కళ్యాణ్కు యూత్లో మంచి క్రేజ్ ఉంటుంది. నటుడిగా కూడా ప్రజలు ఆదరిస్తారు. ఆయన ప్రసంగాలు కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అయితే కారణాలు ఏవైనా ఆయన లైవ్ కవరేజ్లను అన్ని ఛానల్స్ అంతగా ఇవ్వడం లేదని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొనుగోలు చేసిన ఛానల్స్లో ఇక నుంచి జనసేన వాయిస్, పవన్ లైవ్ కవరేజ్ బాగా ఉండనుంది.
ఎవరీ తోట చంద్రశేఖర్?
చంద్రశేఖర్ 2009లో గుంటూరు పార్లమెంటు స్థానానికి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు చేతిలో ఓడిపోయారు. ఎంపీగా రెండుసార్లు ఓడిపోయినా.. పారిశ్రామికవేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు. హైదారబాద్ టాప్ కంపెనీల్లోని ఓ కంపెనీకి అధినేత. ఈ నేపథ్యంలో పవన్ కోరుకుంటున్న ఛానల్ను ఆయన సొంతం చేసుకున్నారు.
ఆ టీవీ ఛానల్ కూడా పవన్కు అనుకూలంగా
ఇక, సీపీఎంకు అనుబంధంగా ఉన్న 10 టీవీ కూడా పవన్కు అనుకూలంగా ఉండనుందని చెబుతున్నారు. ఆగస్టు నుంచి ఈ ఛానల్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అంటున్నారు. దీనిని నిమ్మగడ్డ ప్రసాద్ తీసుకోనున్నారని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమంటే దీని వెనకుల చిరంజీవి ఉంటారనే ప్రచారం కూడా సాగుతోందని అంటున్నారు. నిమ్మగడ్డ గతంలో మాటీవీలో షేర్లు ఉండేవి. యాజమాన్యం మారడంతో ప్రస్తుతం స్టార్ మా టీవీగా మారింది. 99, 10 టీవీలు ఇక జనసేన కోసం పని చేయనున్నాయి.