బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ..ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్..కార్యాచరణ ఇదే
Recommended Video
ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల సమక్షంలో బీజేపీ, జనసేన కూటమి సమన్వయ సమావేశం నిర్వహించింది. ఇక పవన్ పర్యటనలో భాగంగా నిన్న మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఇక ఆయన పర్యటనలో ఇవాళ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. నడ్డాతో పవన్ భేటీ కావడం ఇది రెండోసారి.
జేపీ నడ్డాతో భేటీ .. బీజేపీ , జనసేన పార్టీల సమన్వయ సమావేశం
ఏపీలో ఇరుపార్టీల కార్యాచరణపై సమావేశంలో నిశితంగా చర్చించారు. సమావేశంలో జనసేన కీలకనేత నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎంపీ జీవీఎల్, బీజేపీ మహిళా నేత పురందేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణ సైతం పాల్గొన్నారు. ఇక ఈ కీలక సమావేశంలో చర్చించిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలుచేశారు . ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపుతో పాటు అసెంబ్లీ, శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన జసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ నేతల బృందం ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి చర్చించారు.
వైసీపీ భూదందాల కోసమే రాజధాని మార్పు అన్న పవన్
ఏపీలో రెండు పార్టీలు కలిసి చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణ గురించి జేపీ నడ్డాతో చర్చించారు పవన్ కళ్యాణ్. ఇక భేటీ తర్వాత మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజధాని తరలింపు ద్వారా వైసీపీ భూదందాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇక భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించిన ఇరు పార్టీలు అమరావతి రైతులకు మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు .
కార్యాచరణ రూపొందించిన ఇరు పార్టీలు
ఇరు పార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించనున్నారు . ప్రతి 15 రోజులకు ఓసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఇక రాజధాని అమరావతి కార్యాచరణకు ఈనెల 28న సమావేశం అవుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రాజధాని అమరావతికి మద్దతుగా ధర్నాలు, ఆందోళనలు ఏం చేసినా జనసేన , బీజేపీ కలిసే చేయాలని నిర్ణయించామన్నారు.
ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్
రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కవాతు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించినట్టు తెలిపారు. రాజధాని తరలింపు అంశంపై వైసీపీ ఎవరితో చర్చించలేదని పవన్ పేర్కొన్నారు . ప్రధాని నరేంద్ర మోదీతోగానీ, హోంమంత్రి అమిత్ షాతోగానీ, వైసీపీ నేతలు చర్చించలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదే విషయమై జేపీ నడ్డాతో కూడా మాట్లాడామన్న జనసేనాని కేంద్రంతో వైసీపీ దీనిపై చర్చించలేదని నడ్డా చెప్పినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.