మిమ్మల్ని నమ్మట్లేదు: జగన్-బాబులపై పవన్, సీపీఎం మధు చొక్కా విప్పడంతో, యాత్రకు ఆంక్షలు
Recommended Video
అమరావతి: అందరితో కలిసి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అన్నారు. హోదాపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నాటకాలను ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని చెప్పారు. ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి ఇచ్చారన్నారు.
శుక్రవారం ప్రత్యేక హోదా కోసం జనసేన, సీపీఎం, సీపీఐలు పాదయాత్ర ప్రారంభించాయి. ఈ సందర్భంగా పవన్, సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణలు మాట్లాడారు. నాయకులు అమ్ముడుపోతారేమో కానీ ప్రజలు, ప్రజా నాయకులు ఎప్పటికీ అమ్ముడుపోరని పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్పై టీడీపీ గుర్రు, 'అదీ బాబు.. మోడీ వెళ్తుంటేనే వారిని కలిశారు'
పవన్, మధు, రామకృష్ణల పాదయాత్ర
కేంద్ర వైఖరికి నిరసనగా జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేస్తున్నారు. పవన్, రామకృష్ణ, మధులు బెంజ్ సర్కిల్ వద్ద పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర రామవరప్పాడు వరకు కొనసాగుతుంది. తెలంగాణలోని జాతీయ రహదారుల పైన కూడా పాదయాత్ర నిర్వహించాలని పవన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఉద్యమం తీవ్రతరం, పోరాటంలో తొలి అడుగు
ప్రత్యేక హోదా కోసం తాము నిజాయితీగా పోరాటం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. కార్యకర్తలతో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. పోరాటంలో ఇది తొలి అడుగు మాత్రమే అన్నారు.
ఎర్రటి కండువాతో భిన్నంగా పవన్ కళ్యాణ్
బెంజ్ సర్కిల్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఎర్రటి కండువాను తలకు చుట్టుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. పవన్ కొంత భిన్నంగా కనిపించారు. లెఫ్ట్ పార్టీలతో దోస్తీ నేపథ్యంలో ఆయన ఎర్రటి కండువాతో పాల్గొన్నారని భావించవచ్చు. పవన్ అక్కడక్కడ మాట్లాడుకుంటూ ముందుకు కదిలారు. ఎండ వేడికి తాళలేక సీపీఎం మధు తన చొక్కాను విప్పగా, దానిని తన చేతిపై వేసుకొని పవన్ కళ్యాణ్ ముందుకు నడిచారు.
3.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర
పవన్ కళ్యాణ్, లెఫ్ట్ పార్టీ నేతలు కలిసి పాదయాత్ర ప్లాన్ చేశారు. 3.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉండాలని ముందే నిర్ణయించారు. అలాగే రామవరప్పాడులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని కూడా నిర్ణయించారు. పవన్, లెఫ్ట్ పార్టీల నేతల పాదయాత్రకు బందోబస్తు ఏర్పాటు చేశారు.
త్వరగా ముగించాలని, పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు
పవన్ కళ్యాణ్ పాదయాత్రకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గుంటూరు నుంచి వచ్చే వాహనాలు ఏలూరు రోడ్డు వైపు మళ్లించారు. చెన్నై వైపు వెళ్లే వాహనాలను జాతీయ రహదారి పైనే అనుమతించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ను ఎక్కువ సేపు నిలపలేమని, కాబట్టి ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని అంతకుముందు పోలీసులు సూచించారు.