పవర్ కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ .. సీఎం జగన్ ఓకే అంటే బంపర్ ఆఫర్ : కేఏ పాల్
Recommended Video
గత ఎన్నికల తర్వాత రాం గోపాల్ వర్మ తీసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై కేసు వేసి వార్తల్లోకి వచ్చిన కేఏ పాల్ ఏపీ తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంధ్రప్రదేశ్ లో తాజా పరిణామాలు చాలా వేదన కలిగిస్తున్నాయన్న కేఏ పాల్ జగన్ కు బంపర్ ఆఫర్ ఇస్తున్నానని ప్రకటించారు. తనను ఆహ్వానిస్తే రాష్ట్రాభివృద్ధికి పని చేస్తానని చెప్పారు. అంతే కాదు బీజేపీతో జనసేనాని చేతులు కలపడంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ స్పందించారు.
జనసేనకు ఎన్నికల్లో విజయం సాధించే సీన్ లేదని ముందే చెప్పిన కేఏ పాల్
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు కేఏ పాల్ . కేవలం పవర్ కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు . గత ఎన్నికల్లో ఆయనకు ఐదు నుంచి ఆరు శాతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం రాదని ముందే చెప్పానన్న పాల్ కనీసం పార్టీ అధినేత అయ్యుండి రెండు స్థానాలలో పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేదని అయన పేర్కొన్నారు. ఆయన పోటీ చేసే సొంత సీటును కూడా గెలవలేడు అన్న విషయాన్ని తాను ముందే చెప్పానన్నారు.
చిరంజీవి కంటే పవన్ కు పోలైన ఓటింగ్ శాతం చాలా తక్కువ
జేడీ లక్ష్మినారాయణ, బీఎస్పీ, వామపక్ష పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా కూడా సొంత సీటు కూడా గెలవలేకపోయాడన్నారు. పవన్ కు సొంత సామాజికవర్గం అయిన కాపులే ఝలక్ ఇచ్చారని చెప్పారు. నూటికి ఇరవై ఐదు శాతం ఉన్న ఆయన సొంత సామాజిక వర్గం అయిన కాపులే ఆయనకు ఓటు వేయలేదన్నారు. మొత్తం ఆరుశాతం ఓట్లు మాత్రమే పడ్డాయన్నారు. గతంలో అన్నయ్య చిరంజీవికి 18 శాతం పడితే.. ఇప్పుడు తమ్ముడికి ఆరు శాతం మాత్రమే పడ్డాయని.. అది కూడా మూడు నాలుగు పార్టీలతో పొత్తు పెట్టకుంటేనే అంటూ ఎద్దేవా చేశారు కేఏ పాల్ .
సీఎం జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన పాల్
ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను గురించి చెప్పిన ఆయన ఏపీలో రాజధాని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ధర్నాలు చేస్తే సమస్యలు పోవని చెప్పిన కేఏ పాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఆయన స్నేహితుల ద్వారా తాను ఓపెన్ ఆఫర్ ఇచ్చానని చెప్పారు. వారు ఆహ్వానిస్తే తనకు ఉన్న పరిచయాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు కేఏ పాల్ .రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యం అని ఎవరు సీఎం అయితే ఏంటి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
బిలినియర్లు, మిలినియర్లను, ఇన్వెస్టర్లను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్
మూడు నెలల నుంచి ఆరు నెలల్లో సీఎం జగన్ ను కలిసి ఆయన ఆహ్వానం మేరకు కొంతమంది బిలినియర్లు, మిలినియర్లను, ఇన్వెస్టర్లను తీసుకొచ్చి సమ్మిట్ పెట్టి అభివృద్ధి చేస్తానంటున్నారు.
పేద ప్రజలకు న్యాయం జరగాలన్నదే ప్రధాన ఉద్దేశం అని చెప్పిన పాల్ ప్రతిపక్షాలన్నీ కలిసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చెయ్యాలి అన్నారు .ముఖ్యమంత్రి జగన్ తనను ఆహ్వానిస్తే.. తాను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. జగన్ ఓకే అంటే ఏడాదికి ఒకసారి సమ్మిట్ నిర్వహించి రాష్ట్రాన్ని ప్రగతిబాటలో నడిపిద్దామని పిలుపునిచ్చారు కేఏ పాల్ .