హస్తినలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై , వైఎస్ షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసినట్టుగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని అమిత్ షాను కోరినట్లుగా పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్టీల్ ప్లాంట్ పైన మాత్రమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్న షర్మిల పార్టీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరాం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరినట్లుగా పేర్కొన్న పవన్ కళ్యాణ్, విశాఖ స్టీల్ ప్లాంట్ పై తుది నిర్ణయం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల మనోభావాలకు ప్రతీకగా భావించాలని కేంద్ర మంత్రులను కోరామని జనసేనాని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. కేంద్రమంత్రి చెప్పినట్లుగా పోస్కో, స్టీల్ ప్లాంట్ ల మధ్య ఒప్పందం జరిగినప్పుడు జగన్ లేఖ రాయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
షర్మిల పార్టీ విధి విధానాలు వచ్చాక స్పందిస్తా
స్టీల్ ప్లాంట్ పై వైసీపీ చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ ఏర్పాటుపై మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని షర్మిల ఇంకా పార్టీ ప్రారంభించ లేదు కదా! పార్టీ విధి విధానాలు వచ్చాక మాట్లాడుదాం అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, తెలంగాణలో షర్మిల కూడా పార్టీ పెట్టొచ్చని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనపై హైదరాబాద్ లో మాట్లాడతా
కెసిఆర్ పాలన గురించి హైదరాబాద్లోనే మాట్లాడతాను అంటూ పేర్కొన్న పవన్ కళ్యాణ్ హస్తిన వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కూడా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మార్చి 3, 4 తేదీల్లో జనసేన, బిజెపి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని అమిత్ షా కు వివరించామని తెలిపిన పవన్ కళ్యాణ్, ఏపీలో దేవాలయాలపై కొనసాగుతున్న దాడుల విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్ళామని స్పష్టం చేశారు. ఏపీలో తాజా రాజకీయాలపై కేంద్ర మంత్రులతో చర్చించామని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరామని తెలిపారు.