సంచలన నిర్ణయాలు: 3 పడవలపై పవన్ కళ్యాణ్ కాలు
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు కంటే ఎక్కువ పడవల పైన కాలు పెడుతున్నారా!? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ పార్టీ స్థాపిస్తారని ప్రచారం జరిగినప్పుడు దాదాపు ఎవరు అంతగా నమ్మలేదనే చెప్పవచ్చు. పవన్ పార్టీని ప్రకటించడమే అందరికి భిన్నంగా ప్రకటించారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలోను పవన్ భిన్నంగా వెళ్తున్నారు.
పవన్ ఒక పార్టీకి కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలకు మద్దతు పలుకుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి పవన్ పూర్తి మద్దతు ప్రకటించారు. బిజెపితో టిడిపి పొత్తు ఉన్నందున ప్రచారానికి సుముఖత వ్యక్తం చేశారు.
మంగళవారం కన్నడనాట ప్రచారంలో ఓ ట్విస్ట్ ఇచ్చారు. బిజెపి తరఫున ప్రచారం కోసం వెళ్లిన పవన్ కళ్యాణ్... తాను టిడిపి-బిజెపి కూటమి గెలుపు కోసం ప్రచారం చేస్తానని చెబుతూనే... మల్కాజిగిరిలో మాత్రం లోక్సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. మల్కాజిగిరి బరిలో తాను నిలవాలనుకున్నప్పటికీ జెపి కోసమే విరమించుకున్నట్లు చెప్పారు.
ఎన్నికలకు సమయంలో పవన్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో పలు స్థానాల్లో పోటీ చేస్తుందని అందరూ భావించారు. అనూహ్యంగా తమ పార్టీ పోటీ చేయదని ఆయన ప్రకటించారు. బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ తమ పార్టీ అభ్యర్థులను ఏడు చోట్ల స్వతంత్రంగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నారట.
అయితే, విజయవాడ లోకసభ సీటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీతో వచ్చిన విభేదాల వల్లనే పవన్ పోటీ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. పవన్ తన మిత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్కు విజయవాడ లోకసభ టిక్కెట్ కోసం చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేసినా ఫలించలేదని ప్రచారం జరుగుతోంది. పవన్ మాటను పక్కన పెట్టి బాబు... కేశినేని నానికి బిఫాం ఇచ్చారు. దీంతో పవన్ ఏడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించుకున్నారట.
సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీ పెట్టడం, పార్టీని ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం, ఇప్పుడు పలువురిని బరిలో దింపాలని చూడటం వంటి అనూహ్య నిర్ణయాలు పవన్ తీసుకుంటున్నారు. అదే సమయంలో ఓ వైపు టిడిపి-బిజెపి కూటమికి మద్దతు పలుకుతూనే, మల్కాజిగిరిలో మాత్రం అభ్యర్థి పరంగా జెపికి ప్రచారం చేస్తానని చెప్పారు. అదే సమయంలో పార్టీ తరఫున పలుచోట్ల అభ్యర్థులను నిలబెట్టే యోచనలో ఉన్నారట. పవన్ మూడు పడవల మీద కాలు వేస్తున్నారని అంటున్నారు.