'ప్రత్యేక' అడుగు: రంగంలోకి పవన్ కళ్యాణ్, పిలిచి చిక్కుల్లో పడ్డ జగన్!
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పదేపదే పిలిచి ఇప్పుడు కార్నర్ అవుతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి పవన్ ప్రత్యేక హోదా పైన ప్రశ్నించనున్నారు.
పవన్ వద్ద ఫుల్స్టాప్: మోడీ కదలిక వెనుక 2 కారణాలు
ఇన్నాళ్లు కేంద్రం హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని, ఎందుకు నిలదీయడం లేదని తెలుగుదేశం పార్టీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. కాంగ్రెస్ పార్టీ కూడా హోదా పైన గళమెత్తినప్పడికి వైసిపికి వచ్చిన మైలేజీ రావడం లేదనే వాదనలు ఉన్నాయి.
కార్నర్ చేసినట్లేనా?
రేపు హోదా వచ్చినా లేదా దానిని మించి భారీ ప్యాకేజీ వచ్చినా.. తాము నిలదీయడం వల్లే వచ్చిందని వైసిపి గట్టిగా చెప్పుకునేందుకు ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు పవన్ రంగంలోకి దిగారు. తద్వారా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా జనసేన కార్నర్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ప్రత్యేక హోదా పైన పవన్ వరుస సభలు పెట్టి, కేంద్రాన్ని నిలదీస్తే, ఆ తర్వాత భారీ ప్యాకేజీ వచ్చినా ఆ క్రెడిట్ ఎక్కువగా పవన్కు వెళ్తుంది. బీజేపీ, టీడీపీలతో పవన్ ఒప్పందం వంటి మాటలు ఎవరూ పట్టించుకోరని, హోదా లేదా ప్యాకేజీ ముందు ఒప్పందం మాటలు చిన్నబోతాయని అంటున్నారు.
పదేపదే పిలిచిన వైసిపి
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైసిపి పలుమార్లు పవన్ కళ్యాణ్ను పిలిచింది. హోదా పైన పవన్ ఎందుకు మాట్లాడటం లేదని వైసిపి నేతలు నిలదీసింది. ప్రశ్నిస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన పవన్.. ఆరు కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని బీజేపీని, ఎందుకు తీసుకు రావడం లేదని టిడిపిని ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలని రోజా సహా వైసిపి పార్టీ పవన్ను ఎన్నోసార్లు నిలదీసింది.
అందరికీ భిన్నంగా
ఇప్పుడు ప్రశ్నించేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మూడు దశల్లో హోదా కోసం ఉద్యమిస్తానని ప్రకటించారు. తనకు ఇతర పార్టీల వలే రాజకీయ లబ్ధి, పదవులు అవసరం లేదని స్పష్టం చేసారు. ఇతర పార్టీలు సందర్భం వచ్చినప్పుడే ప్రశ్నించాయని చెప్పవచ్చు.
ఇప్పుడు పవన్ ఏకంగా హోదా కోసం ఉద్యమిస్తూ, ఆ అంశాన్ని సొంతం చేసుకనే దిశలో సాగుతున్నారు. ఆయనకు స్వయంగా టిడిపి, బిజెపి, ప్రత్యేక హోద ఉద్యమ నాయకుల నుంచి మద్దతు లభించడం కూడా గమనార్హం. అంతేకాదు, పవన్ తిరుపతి సభ అనంతరం కేంద్రంలో కదలిక రావడం కూడా గమనార్హం. మొత్తానికి హోదా అంశంపై పవన్ను పిలిచి జగన్ కార్నర్ అయ్యారని అంటున్నారు.