జనసేన నేత అభిమానం .. పవన్ పుట్టిన రోజున సాగరతీరంలో జనసేనాని సైకత శిల్పం
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని పవన్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని భావించారు. అయితే ఊహించని పరిణామం గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్న పవన్ ఫాన్స్ ముగ్గురు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు మృతి చెందడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర విషాదంలో ఉన్నారు.
పవన్ అభిమానుల మృతి కలిచివేసిందన్న చిరంజీవి .. రామ్ చరణ్ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ఘటనతో ఈసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు డల్ గా మారాయి. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ, బయట మాత్రం పెద్దగా హడావుడి కనిపించలేదు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా నేత. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన చైతన్య, తన అభిమాన హీరో అయిన పవర్ స్టార్ కు, జనసేన అధినేతకు వినూత్న పద్ధతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన వంశధార నది, సాగరతీరం కలుస్తున్న ప్రాంతమైన కళింగపట్నంలో పవన్ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇసుకతో తయారు చేసిన ఈ శిల్పంతో పాటు, జనసేన పార్టీని తెలియజేసేలాగా చక్కగా జెండాలతో అలంకరించారు. జనసేన పార్టీ నేత ఇసుకతో రూపొందించిన ఈ శిల్పం చూపరులను ఆకట్టుకుంటుంది. కళింగపట్నం సమీపంలోని ప్రజలు, జనసేన అభిమానులు ఈ సైకత శిల్పాన్ని చూసి వెళ్తున్నారు. కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, గుండెల్లో గూడు కట్టుకున్న తమ అభిమానాన్ని, పవన్ పై ఉన్న ప్రేమను తెలియజేసేలా పవన్ కళ్యాణ్ సైకత శిల్పాన్ని రూపొందించారు.