లోకేష్ను తీసేయండి, తువ్వాలుతో బయట స్నానం చేశాడు, జగన్లా ముద్దులు పెట్టను: పవన్
పోలవరం: పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని మంగళారం డిమాండ్ చేశారు. ప్రజలను త్యాగం చేయమని నేతలు చెబుతున్నారని, కానీ నాయకులు మాత్రం త్యాగాలు చేయడం లేదని విమర్శించారు. వేలకోట్లు ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రులు కాలేరని చెప్పారు.
'ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు దేశం విడిచిపోయే ఛాన్స్', అంబులెన్స్పై జగన్ సెల్ఫ్గోల్!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ దానిని నిర్జీవం చేస్తున్నాడని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక ఆఫీసర్లను నియమిస్తున్నారని ధ్వజమెత్తారు.
లోకేష్ను తప్పించి ప్రత్యేక ఆఫీసర్ను పెట్టండి, చంద్రబాబును దించేవాడిని
మంత్రి నారా లోకేష్ను ఆ పదవి నుంచి తీసేసి ప్రత్యేక ఆఫీసర్ను పెడితే సరిపోతుందని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో మార్పు తేవడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎవరికీ ఆయుధం పట్టుకోవాల్సిన అవసరం రాకూడదన్నారు. భూనిర్వాసితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. పోలవరంతో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు కావాల్సిన నీరు లభిస్తుందని చెప్పారు.మాదిగల్లో పెద్ద మాదిగనని చెప్పుకునే చంద్రబాబుకు కులాల పేర్లతో తిడుతుంటే గుర్తుకు రావడం లేదా అన్నారు. బీజేపీతో తాను దోస్తీ చేసి ఉంటే చంద్రబాబును ఎప్పుడో దించేసేవాడినని చెప్పారు.
వైయస్ హయాంలో మైసూరా తువ్వాలుతో వచ్చి బయట స్నానం చేశారు
అధికార, ప్రతిపక్షాలు ప్రజలను త్యాగం చేయమంటారు కానీ వారు మాత్రం త్యాగాలు చేయరని పవన్ విమర్శించారు. నిర్వాసితులకు ఇళ్లు లేకుండా వెళ్లిపోమంటే చిన్న ఉదాహరణ చెబుతానని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో మైసూరా రెడ్డి ఇంటిని కూలగొట్టారని, అప్పుడు మైసూరాకు కోపం వచ్చిందని, ఆయన చిన్న తువ్వాలుతో బయటకు వచ్చి రోడ్డుపై స్నానం చేసి నిరసన తెలిపారన్నారు. అన్ని కోట్లు ఉన్న ఓ వ్యక్తికే అంత ఆవేదన ఉంటే, ఇన్ని లక్షల మందికి ఎలాంటి ఇల్లు వాకిలి ఇవ్వకుండా వెళ్లిపోమంటే ఎలాగని ప్రశ్నించారు.
కొత్త పార్టీ పెట్టానని ఓట్ల కోసం రాలేదు, చింతమనేనిపై ఆగ్రహం
నేనేదో కొత్త పార్టీ పెట్టాను కాబట్టి ఓట్లు వేయమని చెప్పడానికి మాత్రమే తాను రాలేదని, మీ సమస్యలపై పోరాడేందుకు, రాబోయే తరం కోసం ఈ తరంపై పోరాడేందుకు తాను పార్టీ పెట్టానని పవన్ చెప్పారు. వీళ్లతో కొట్లాడేందుకు తనపై వేల కోట్లు లేవన్నారు. మీ గుండెల్లో ఉన్న ప్రేమే నా ఆస్తి, నా శక్తి అన్నారు. భూబకాసురుడు చింతమనేని ప్రభాకర్ పైన చర్యలు తీసుకోవాలని తనకు విజ్ఞప్తి వచ్చిందని విజ్ఞాపన పత్రం చూపిస్తూ చెప్పారు. జనసేన లేకుంటే ఇలాంటి రౌడీలు ఊరికి ఒకడు ఉండేవాడని చెప్పారు. పోలీసులను కొడుతాడు, భయపెడతాడని, ఇదేమిటని మండిపడ్డారు.
జనసేన బలపడుతుందనే ఎన్నికలు పెట్టడం లేదు
నేను 2019లో గెలిచేందుకో, ముఖ్యమంత్రి కావడానికో తాను రాలేదని పవన్ చెప్పారు. మీ సమస్యలపై పోరాడేందుకు వచ్చానని అన్నారు. చంద్రబాబు గారూ.. సర్పంచ్ల బదులు ప్రత్యేక ఆఫీసర్లను పెట్టారు, సరే లోకేష్ను కూడా మంత్రిగా తీసేసి ప్రత్యేక ఆఫీసర్ను పెట్టాలని, చంద్రబాబు కూడా తప్పుకొని, చీఫ్ సెక్రటరీకి బాధ్యతలు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలు పెడితే జనసేన బలపడుతుందనే భయం పట్టుకుందన్నారు. నేను వేల కోట్లు సంపాదించేందుకో, ప్రజల నుంచి తీసుకునేందుకో రాలేదన్నారు. తనకు ప్రజల మంచి కోసం ఆవేదన ఉందని చెప్పారు.
జగన్లా ముద్దులు పెట్టేందుకు రాలేదు
జనసేన లేకుంటే బలంగా మాట్లాడే ఒక్క రాజకీయ పార్టీ లేదని పవన్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలా పాదయాత్ర చేస్తూ కూర్చోబెట్టి ముద్దులు పెట్టడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. రాజకీయ ప్రక్షాళణ కోసం వచ్చానని, యువతకు ఉపాధి కల్పించేందుకు వచ్చానని చెప్పారు. కేవలం రాజకీయ నాయకుల పిల్లలే బాగుండాలా అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితుల బాధలను టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు.
ఆ క్యాంటీన్ దేవినేనిదట
అక్కడ ఓ క్యాంటీన్ ఉందని, అది దేవినేని ఉమది అని తెలిసిందని, పోలవరం చూసేందుకు టీడీపీకి చెందిన వారు రోజు పది బస్సుల్లో వస్తున్నారని, కానీ వారు నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవడానికి మరింత ముందుకు వెళ్లాలన్నారు. బస్సులకు ప్రజల సొమ్మే చెల్లించాలని, వచ్చిన టీడీపీ నేతలకు తినిపించేందుకు అక్కడ ఉన్న క్యాంటీన్లో తినిపించాలన్నా అది టీడీపీ మంత్రిదే అన్నారు. అసలు అడగడానికి ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. నేను నవ్వుతున్నానంటే.. నిస్సహాయతతో, ఏం చేయాలో తెలియక నవ్వుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంశాన్ని ప్రస్తావించారు. పోలవరం నిర్వాసితులకు పోలీసులు, రెవెన్యూ అధికారులపై కోపం ఉందని, కానీ వారేం చేస్తారని, రాజకీయ నాయకుల బాధ్యత అన్నారు. చేయాల్సింది అధికార పార్టీ, చేపించాల్సింది ప్రతిపక్షం అన్నారు. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళణ చేయకుండా మనం ఏం చేయలేమన్నారు. ఎవరికీ ఆయుధం పట్టుకోవాల్సిన అవసరం రావొద్దన్నారు. బాధితులకు న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిది అని, చంద్రబాబుకు ఎక్కువ బాధ్యత ఉందన్నారు. పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయలేకుంటే నేనే పోలవరం నిర్వాసితుల రక్షణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. టీడీపీ నేతలు పోలవరం సందర్శనకు ఎలా వస్తున్నారో, నేను అలాగే బస్సులు వేసి నిర్వాసితులను అమరావతి తీసుకు వెళ్తానని చెప్పారు.