యువతకు కావాల్సింది పాకెట్ మనీ కాదు...ఉద్యోగాలు:నిరుద్యోగ భృతిపై పవన్ సెటైర్లు
Recommended Video
పశ్చిమ గోదావరి:రాష్ట్రంలో యువతకు పాకెట్ మనీ ఇస్తామంటున్న టిడిపి ప్రభుత్వం ఆలోచన సరిగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగ అవకాశాలే తప్ప పాకెట్ మనీ కాదన్నారు.
పశ్చిమగాదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్ర నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ జంగారెడ్డిగూడెం ఏలూరు ప్రధాన రహదారిలో బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువయ్యాయన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుత్లోనే ఉందని ప్రస్తుత ఎన్నికల్లో, రాజకీయాల్లో యువత పాత్ర అత్యంత కీలకమని పవన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నగదు, ఇతర వ్యాపకాలకు లొంగకుండా యువత మంచి పార్టీకి ఓట్లు వేయాలని ఆయన సూచించారు.
ఎదుటి వ్యక్తిని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఎవ్వరు తప్పు చేసినా యువత నిలదీయాలని అన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో హామీలు ఇచ్చి మాట మారుస్తున్నారని అందుకే రాష్ట్రంలో అతి పెద్ద మూడో పార్టీగా ప్రజాసమస్యల సాధనకై జనసేన ఏర్పడిందన్నారు. యువత ప్రతి ఒక్కరూ ఓటుహక్కును నమోదు చేయించుకోవాలని తెలిపారు. జనసేన యువతకు మంచి ఉపాధి కల్పించే ఆలోచనలు చేస్తుందని పవన్ పేర్కొన్నారు.
ఎపి ప్రభుత్వం మహిళలను విస్మరించడం తగదన్నారు. మహిళలతో విజయవాడ కేంద్రంగా సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తామని పవన్ పేర్కొన్నారు. వాడుకుని వదిలేసే రాజకీయ వ్యవస్ధకు బుద్ధి చెప్పాలన్నారు...బలమైన రాజకీయ వ్యవస్థ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ రాష్ట్రంలో 14 వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మించామంటున్నారు. ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలోని జంగారెడ్డిగూడెం రహదారులను చూడండి. ఇక్కడ రహదారులు దారుణంగా ఉన్నాయి. 14 వేల కిలోమీటర్ల రోడ్లు ఎక్కడ వేశారు...? రాష్ట్రంలో టిడిపి నాయకులు ఎక్కడ తిరుగుతారో అక్కడ రోడ్లు వేశారే తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాంతాల్లో రోడ్లు వేయలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టిడిపి ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.
ఇప్పటికే విదేశాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల కోట్ల వరకు అప్పులు తెచ్చిందని, ఇంకా అమెరికా వెళ్ళి సేంద్రియ వ్యవసాయం అని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ అప్పులు ఎవరు కడతారు. ప్రజలపై భారం పెంచే అప్పులను ఆపాలని సీఎం చంద్రబాబుని పవన్ కోరారు. సీఎం గారు కొత్త ఎత్తులు వేయవద్దు...సేంద్రియ వ్యవసాయ విధానం అంటే విదేశాల నుంచి టెక్నాలజీ అవసరం లేదు...దేశీయ టెక్నాలజీ చాలని పవన్ హితవు పలికారు.