కాళ్లు మొక్కడాలు, యూటర్న్లు! చంద్రబాబును ఏకిపారేసిన పవన్: ‘గల్లా ‘గజినీ’ అయ్యారా?’
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నష్టం కలగకూడదనే.. పవన్ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
బీజేపీ ఎంతో టీడీపీ అంతే..
ఈ నేపథ్యంలో ‘చంద్రబాబుగారూ మీకు ఇదే నా బదులు... అంటూ పవన్ శనివారం ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేశారు. ‘బీజేపీని వెనకేసుకొస్తే మాకు(జనసేన) వచ్చే లాభమేంటి? ఏపీ ప్రజలు సంపూర్ణంగా బీజేపీని వదిలేశారు. అలాంటి పార్టీతో పొత్తు ఎవరైనా పెట్టుకుంటారా? వెనకేసుకొస్తారా? అసలు నా ట్వీట్ల ఉద్దేశం ఏంటంటే... బీజేపీతో సమానంగా టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని అంతేదారుణంగా దెబ్బకొట్టిందని. ప్రజలను మోసం చేశారు. వంచించారని అర్థమవుతోంది' అని పవన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు ఈరోజే తెలిసిందా?
అంతేగాక, ‘ మరి ఈ రోజు కొత్తగా తెలుసుకున్నట్లుగా.. మోసపోయినట్లుగా మీరు(చంద్రబాబు) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీ సుదీర్ఘమైన అనుభవం, పాలన దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద మీరూ.. మీ పార్టీ ఎన్ని రకాలుగా మాట మార్చారో మీకు తెలియంది కాదు. తద్వారా ఏపీ ప్రజలను నిలకడలేని వాళ్లుగా.. అవకాశవాదులుగా.. ఆత్మగౌరవం లేనివాళ్లుగా దేశస్థాయిలో నిలబెట్టారు' అని పవన్ అన్నారు.
మోడీ, బీజేపీ కాళ్లు మొక్కి.. చంద్రబాబు ఎలా నమ్మాలి?
‘నిన్న ప్రధాన మంత్రి మోదీగారి కాళ్లకి మీ టీడీపీ ఎంపీలు పాధాభివందనం చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. అదే సభలో ఓవైపు మీ ఎంపీలు బీజేపీని తిడతారు. ఇంకోవైపు బీజేపీ కాళ్లకు మొక్కుతారు. దీన్ని మేం ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్గారు మిమల్ని ఇంకా మిత్రులుగా చూస్తున్నారు అని అంటారు. దీనిని బట్టి ‘మీరు చేస్తున్నది ధర్మమైన పోరాటం అని ఎలా నమ్ముతామో మీరే చెప్పండి?' అని చంద్రబాబును ఉద్దేశించి పవన్ ట్వీట్లు చేశారు. రేపు మళ్లీ మీ అవసరాల కోసం.. వైఖరి మార్చుకోరన్న గ్యారెంటీ ఏంటీ?.. అని పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎంపీ గల్లా ‘గజినీ’ అయ్యారా?
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్పై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. గతంలో గల్లా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ఫోటోను ఉంచారు. గజినీ చిత్రంలో హీరోలాగా టీడీపీ వాళ్లకి Convenient Memory loss Syndrome రోజు రోజుకీ పెరిగిపోతోందని పవన్ సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఉత్తమమని గల్లా వ్యాఖ్యానించిన స్టేట్మెంట్ పవన్ జత చేశారు. జనసేన కన్వినెన్స్ కోసం ఎలాంటి పనులు చేయదని, ప్రజలకు ఏది మేలు అనుకుంటే అదే చేస్తోందని టీడీపీకి చురకలంటించారు. 175 ఎమ్మెల్యేలు, 25ఎంపీలే ఏపీ కాదని, 5కోట్ల మంది ప్రజలు అని పవన్ చెప్పారు.