జనసేనలో నాకూ అధికారంలేదు, బాధ్యతలు అప్పగిస్తే అలాగా, మీదే తప్పు: పవన్ ఆవేదన
విజయవాడ: కొందరు మనల్ని ఉద్దేశించి, మీరు ప్రశ్నించండని, మేం అధికారంలోకి వస్తామనే స్థాయిలో ఉన్నారని, కానీ అలా కాదని, మనం అధికారంలోకి వెళ్లాలని, అధికారంలోకి వస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం విజయవాడలో తూర్పు గోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలతో జనసేనాని సమావేశమయ్యారు.
చదవండి: ఐటీ దాడి ఎఫెక్ట్: ఐటీ ఆఫీసర్లకు నో సెక్యూరిటీ, సుప్రీం కోర్టుకు.. బాబు సంచలన నిర్ణయాలు!
ధవళేశ్వరం బ్యారేజిపై నిర్వహించే భారీ కవాతుతో జనసేన సత్తాను దేశవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ఆ కవాతు తర్వాత దేశం మొత్తం జనసేన గురించే మాట్లాడుకోవాలని, అందరూ సహకరించాలన్నారు. జనసేనకు తూర్పు గోదావరి జిల్లా ఆయువుపట్టు అని, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నుంచి 22 రోజుల పాటు పర్యటిస్తానని, పశ్చిమ గోదావరి జిల్లాలో మరో రెండు రోజుల్లో యాత్ర పూర్తవుతుందని చెప్పారు.
తూగోలో జనసేనకు బలం, పట్టు సాధించకుంటే మీదే తప్పు
15న కవాతుతో తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెట్టి పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని, తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని, తూర్పుతోనే మార్పు ప్రారంభం కావాలని పవన్ అన్నారు. జనసేనకు జిల్లాలో ఎంతో బలం ఉందని, ఇక్కడ పట్టు సాధించలేకపోతే ఆ తప్పు నాయకులదే అవుతుందని తేల్చి చెప్పారు. జనసేనలో కోటరీలు ఉండవద్దని, అలాంటి కోటరీలు కట్టే విధానానికి తాను వ్యతిరేకమని చెప్పారు. ఇప్పటి వరకు పితాని బాలకృష్ణ మినహా జనసేన నుంచి ఎవరికీ సీటు ఇవ్వలేదన్నారు.
జనసేనలో నాతో సహా ఎవరికీ ఎలాంటి అధికారాలు లేవు
టిక్కెట్లు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. టిక్కెట్ల కేటాయింపునకు కమిటీ ఉంటుందని, కేటాయింపు విధానంలో పారదర్శకత ఉంటుందని చెప్పారు. జనసేన నిర్మాణం ఆలస్యమైనా పక్కాగా ఉంటుందని, ఇప్పుడు వేసిన ఏ కమిటీ పూర్తి స్థాయి కమిటీ కాదన్నారు. తనతో సహా ఎవరికీ ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. పదవుల రూపంలో బాధ్యతలు మాత్రమే తీసుకున్నామని, పార్టీ పదవి అంటే బాధ్యత అని, కమిటీల నియామకంలో లోపం కనిపిస్తే చెప్పాలని నేతలకు సూచించారు. విజయవాడలో ఐదు రోజుల్లో కొత్త కార్యాలయం ప్రారంభం కానుందని, జనసేనలో చేరేందుకు ఇప్పుడు ఇప్పుడే నాయకులు సిద్ధమవుతున్నారని చెప్పారు.
ఇతర పార్టీల్లో ఇంత ఖర్చు పెట్టాలని చెప్పను
అందరూ ప్రశ్నించే పార్టీ అంటారని, ప్రశ్నించడం మాత్రమే కాదని, ప్రశ్నించడం ద్వారా అధికారంలోకి వెళ్లడం మన పార్టీ ముఖ్య ఉద్దేశ్యమని పవన్ అన్నారు. మార్పు కోసం వచ్చానని, అందరికీ వ్యవస్థలో రావాల్సిన లాభాలను పంచాలని, ఆడపడుచులు అందరూ కలిసి తూర్పు గోదావరి జిల్లాలో జనబాటను తలమానికంగా చేయాలని సూచించారు. జనసేన 7 సిద్ధాంతాలను ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. ఇతర పార్టీల్లాగా ఇంత నిధులు కావాలని, ఇంత ఖర్చు పెట్టాలని నేను చెప్పనని, అంత అవసరాలు కూడా మన పార్టీకి లేవని చెప్పారు.
నేను బాధ్యతలు అప్పగిస్తే.. పవన్ ఆవేదన
తాను మార్పు కోసం ఎంతో ఔన్నత్యం, విశాల దృక్పథంతో ఉంటే, నేను బాధ్యతలు అప్పగించిన కొందరు చిన్న ఆలోచన విధానంతో కనిపించారని, అది తనకు ఇబ్బంది కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వారి తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత మీదేనని, అధ్యక్షుడు అలా ఉంటే మీరు ఇలా ప్రవర్తించడం తప్పు అని సరిదిద్దే బాధ్యత మీమీద పెడుతున్నానని నేతలతో అన్నారు. డబ్బును అవసరం మేర ఖర్చు చేయండని, వృధా చేయవద్దని, బెట్టింగ్ వంటి తప్పులు చేయవద్దన్నారు.