సీఎం బంధువుల నా రూంలోకి వచ్చి బెదిరించారు, నా తల్లితో ఏం చెప్పానంటే: పవన్ కళ్యాణ్
డల్లాస్: తాను విశ్వనరుడిని అని, యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన డల్లాస్లో జరిగిన ప్రవాస గర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు మీడియా ఛానల్స్, పేపర్స్ లేవని, తాను కేవలం ప్రజల హృదయస్పందనను మాత్రమే నమ్ముతానని చెప్పారు.
'ఏపీ వ్యతిరేకి టీఆర్ఎస్ గెలిస్తే పవన్, జగన్ సంబరాలా?, కేసీఆర్కు ధైర్యం ఉందా'
ఊహ తెలిసినప్పటి నుంచి తనకు ఏ పనికైతే భయపడతానో ఆ పని ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. అన్నిటికంటే బలమైన కండరము ధైర్యం, కండలు పెంచవచ్చు కానీ ధైర్యాన్ని ఎలా పెంచుతామని ప్రశ్నించారు. ప్రతీరోజు పిరికితనాన్ని ఎదుర్కొంటూ వెళ్తేనే ధైర్యాన్ని సాధించగలమని, ఒక రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ధైర్యం కావాలన్నారు.
జీవన సంగ్రమం నుంచి పారిపోమని చెబుతుంది
జీవన సంగ్రామం నుంచి పారిపోమని పిరికితనం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని, దానికి ధైర్యం అనే గాండీవాన్ని ధరించి యుద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే తెలియదని, అందరూ బాగుండాలని, తప్పులు చేసేవాళ్లకు శిక్షపడాలని అనుకునే వాడినని, దురదృష్టవశాత్తు తప్పులు చేసేవారు అధికారంలో కూర్చుంటున్నారని, నిజాయితీగా ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన వాపోయారు.
ఆవేశంతోనే, ఆవేదనతోనే కాకుండా ఆలోచనలు పంచుకుందామనే
తాను ఈరోజు ఆవేశంతోనో, ఆవేదనతోనో కాకుండా తన ఆలోచనలు పంచుకుందామని అనుకుంటున్నానని పవన్ ఈ సందర్భంగా చెప్పారు. ఉమ్మడి ఏపీలో 294 మంది ఎమ్మెల్యేలు, దేశంలోని 542 మంది ఎంపీలలో తెలుగు రాష్ట్రాల నుండి 42 మంది ఎంపీలు కూర్చొని మన భవిష్యత్తు నిర్దేశిస్తారని, వీళ్ళు సవ్యంగా ఉంటే బాగుంటుందని చెప్పారు. నాయకులు సరిగా ఉండకుండా వారు చేసే పబ్లిక్ పాలసీలు తనకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు చూస్తూ కూర్చోవాలా, భరించాలా అని ప్రశ్నించారు. తనకూ అందరిలాగే నాయకులు చేసే తప్పులు మీద కోపం ఉందని, ఆ కోపాన్ని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా పెడితే సరిపోతుందా అని ప్రశ్నించారు.
నిజ జీవితంలో సత్యాగ్రహి
చాలా సంవత్సరాల క్రితం సత్యాగ్రహి అనే సినిమా మొదలు పెట్టానని, ఇప్పుడు తాను ఏదైతే చేస్తున్నానో అదే సత్యాగ్రహి సినిమా అని పవన్ చెప్పారు. సినిమాల్లో పోరాటం చేస్తే పరిష్కారం దొరకవని, నిజ జీవితంలోకి వచ్చి పోరాటం చేయాలని, ఆ రోజు తాను సినిమా ఆపేస్తే అందరూ తనను తిట్టారని, నీకు నిలకడ లేదన్నారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు తాను సత్యాగ్రహి సినిమా ఆపడానికి కారణం నిజ జీవితంలో చేయడం కోసమని, సత్యాగ్రహి పోస్టర్లో కూడా ఒకవైపు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఫోటో, మరోవైపు చే గువేరా ఫోటో ఉంటుందని చెప్పారు.
నాడు ఓ ముఖ్యమంత్రి మనుషులు బెదిరించారు
తాను దేశానికి ఏం చేయగలనని ఆలోచించి పార్టీ పెట్టానని, వయసు ఉన్నప్పుడు, పోరాడే శక్తి ఉన్నప్పుడు, పాతిక సంవత్సరాల జీవితాన్ని దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం, మానవత్వం కోసం పనిచేయాలని పార్టీ పెట్టాననని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను అన్నవరం సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నాటి సీఎం బంధువులు కొంతమంది తన రూంలోకి వచ్చి మాకు సినిమా చేయాలని బెదిరింపు ధోరణిలో అడిగారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను బయపెట్టాలని చూస్తే ఎలాగని ప్రశ్నించారు.
అలా బెదిరించడం నాకు నచ్చలేదు
పవన్ సినిమా నటుడు అని వారికి మెత్తగా కనిపిస్తాడేమో కానీ చాలా బలమైన వ్యక్తి అని జనసేనాని చెప్పారు. సినిమా చేయాలంటే మాములుగా అడగండి కుదిరితే చేస్తానని కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరిస్తే బెదిరిపోయి చేస్తానని అనుకున్నారేమోనని అన్నారు. ఒక మారుమూల నియోజకవర్గానికి వెళ్తే లక్షలాది మంది అభిమానులు ఉన్న తనను ఇలా బెదిరించడం తనకు నచ్చలేదని చెప్పారు.
మీరు నిజమైన హీరోలు
యువత ఇబ్బందులు పడవద్దనే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. రాజకీయాల్లోకి వెళతానంటే తన తల్లి ఎందుకని ప్రశ్నించిందని, అందుకు తాను స్పందిస్తూ... ఇప్పుడున్న వ్యవస్థ భవిష్యత్లో మరింత అధ్వానంగా మారి, తనకు అరవై డెబ్బై ఏళ్లు వచ్చే సరికి నిస్సహాయ స్థితిలో బాధపడకూడదని రాజకీయాల్లోకి వచ్చానని, ఆత్మసాక్షికి జవాబు చెప్పుకునేందుకు వచ్చానని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఓ దేశ సంపద నదులు, ఖనిజాల్లో ఉండదనీ, ఏ దేశానికే యువతే నిజమైన సంపద అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నుంచి ఎక్కడో డల్లాస్లో ఉండే రవి వరకూ అందరూ మనోడే అన్న భావన భారతీయులకు ఉంటుందని చెప్పారు. సమస్యలు ఎదురైనా కుంగిపోకుండా అమెరికాలో సంపాదిస్తూ స్వదేశానికి డబ్బులు పంపిస్తున్న మీరు నిజమైన హీరోలన్నారు. ప్రవాస తెలుగువారిని కాపాడుకునే బాధ్యత జనసేనపై ఉందన్నారు. తనకు ఇంట్లో నుంచి రావడమే బద్దకమనీ, అన్ని బాగుంటే ఇంట్లో నుంచి బయటకేరానని చెప్పారు. తనకు మీడియా, ఛానల్స్ లేవని కేవలం ప్రజల హృదయ స్పందనను నమ్ముతానని చెప్పారు.