దాడి చేస్తే.. నా సంగతి తెలియదు: పవన్ ఎదురుదాడి, లగడపాటి సర్వేకు కౌంటర్
కొల్లేరు: లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలు కొల్లేరుకు వచ్చినప్పుడు లేని ఆంక్షలు తనకు ఎందుకని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రశ్నించారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోరాట యాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో మాట్లాడారు. తన కొల్లేరు యాత్రకు కట్టుబాట్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
షాకింగ్: పవన్ సభకు వెళ్తే రూ.50వేలు జరిమానా!, రాత్రి జనసేనానిపై దాడి యత్నమంటూ...
జనసేనకు భయపడే పర్యటనకు అనుమతించడం లేదని అన్నారు. తనపై దాడికి ప్రయత్నిస్తే ఏ స్థాయికి వెళ్తానో ఊహించలేరని హెచ్చరికలు జారీ చేశారు. సాయుధ పోరాటం చేసే శక్తి తనకు ఉందని చెప్పారు. పోలీసులకు తాము అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటికీ లంక గ్రామాల్లో తాగునీరు లేదన్నారు.
నాపై దాడికి ప్రయత్నించారు
గత రాత్రి తనపై దాడికి ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను చేతులు కట్టుకొని కూర్చునే వ్యక్తిని కాదని, మక్కెలు ఇరగ్గొడతానని చెప్పారు. నా మీద దాడి చేస్తే చేతులు ముడుచుకొని కూర్చోనని, నా సంగతి వాళ్లకు తెలియదని హెచ్చరించారు. తనమీద దెబ్బ పడే కొద్ది ఎదుగుతానే తప్ప తగ్గనని చెప్పారు. తాను సీఎం అయితే కొల్లేరు రెగ్యులేటర్లు ఏర్పాటు చేస్తానని చెప్పారు. తనను గెలిపించకున్నా, తన వెంట ఉంటే పోరాడి సాధించుకుందామని చెప్పారు. సేంద్రియ వ్యవసాయం గురించి చంద్రబాబు అమెరికాలో గొప్పగా చెప్పారని, ఇక్కడ అందుకు విరుద్దంగా ఉన్నారని ఆరోపించారు.
లగడపాటి సర్వేపై ఆగ్రహం
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంస్థ చేసిన సర్వేలో జనసేనకు కేవలం నాలుగైదు శాతమే ఓట్లు వస్తాయని చెప్పడంపై పవన్ ధీటుగా స్పందించారు. లగడపాటి వంటి వారు తమ సర్వేల్లో జనసేన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని, తన ప్రభావం నాలుగైదు శాతం అయితే భయమెందుకని, కానీ తన బలం 18 శాతమని గుర్తు పెట్టుకోవాలన్నారు. జనసేన కోసం ప్రాణాలనే పెట్టుబడిగా పెట్టానని, తొమ్మిది నెలల్లో సీఎం కావాలనే ఆశతో తాను రాలేదని, బలమైన సిద్ధాంతాలను, విధానాలని తీసుకు వస్తామని, పొలిటికల్ క్రిమినల్స్ను తరిమేస్తామన్నారు.
గతంలోని పరిస్థితులు ఇప్పుడు లేవు
గతంలోని పరిస్థితిలు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో లేవని పవన్ చెప్పారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదన్నారు. నాయకులను అదుపులో చేసే పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు లేరని చెప్పారు. తన పోరాటంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తాను సిద్ధమని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని భయాందోళన పరిస్థితులు పశ్చిమ గోదావరిలో ఉన్నాయన్నారు. తనకు తెలిసి పశ్చిమ గోదావరి కాలుష్యం లేకుండా, పచ్చగా ఉండేదని పవన్ చెప్పారు. కానీ ఇప్పుడు కాలుష్యం ఎక్కువయిందన్నారు. ఏ మూల చూసినా రాష్ట్రంలో ఎక్కడా లేని భయాందోళనలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. గూండాయిజాన్ని కంట్రోల్ చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించడం లేదన్నారు. చట్టాన్ని చేసే నాయకులే దానిని చేతుల్లోకి తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు.
వాళ్లు ఏ స్థాయిలో యుద్ధం చేస్తే నేను ఆ స్థాయిలో
వాళ్లు ఏ స్థాయిలో యుద్ధం చేస్తే నేను ఆ స్థాయిలో చేస్తానని పవన్ అన్నారు. అందరి సహకారం తీసుకుంటామని చెప్పారు. అధికారులకు, ముఖ్యమంత్రికి చెబుతామన్నారు. ఎవరూ స్పందించకుంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోటీ గురించి నేతలతో చర్చిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.